: నేడు గోల్డ్ బాండ్ కొంటే రెండేళ్ల వడ్డీ 'ఫట్' అన్నట్టే!

ఏదో ధన త్రయోదశి కదా... బంగారం కొనాలి. ఈసారి ఆభరణాల బదులు, ఇటీవల మోదీ ప్రారంభించిన గోల్డ్ స్కీముల్లో పెట్టుబడి పెడదామని భావిస్తున్నారా? గోల్డ్ బాండ్ కొనుగోలు చేద్దామని అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. నేడు గోల్డ్ బాండ్ కొనుగోలు చేస్తే రెండేళ్ల వడ్డీ నష్టపోయినట్టు లెక్కేసుకోవాలి. బాండ్ల ధరలను స్పాట్ రేట్ పై కాకుండా, ఫిక్సెడ్ రేటుపై కొనుగోలు చేయాల్సి రావడమే ఇందుకు కారణం. ఈ స్కీమును ప్రకటించినప్పుడు ఆనాడున్న పది గ్రాముల బంగారం ధరను ప్రాతిపదికగా తీసుకుని బాండ్లలో గ్రాముకు రూ. 2,684గా ధరను నిర్ణయించారు. ఇక, ఈ స్కీమును ప్రారంభించిన 5వ తేదీన బంగారం ధర పది గ్రాములకు రూ. 26,025 వద్ద ఉంది. అంటే, గ్రాము ధర రూ. 2,602 అన్నట్టు. 10 గ్రాముల బాండ్ కొనుగోలు చేయాలంటే, రూ. 660 నష్టానికి కొంటున్నట్టు లెక్క. ఇక ప్రభుత్వం ఆఫర్ చేసిన 2.75 శాతం వడ్డీతో పోలిస్తే, ఈ నష్టమే అధికం. ఇక నేడు బంగారం ధర రూ. 25,523 వద్ద ఉంది. అంటే ఈ ధరపై బాండ్లను కొంటే రెండేళ్ల వడ్డీని కోల్పోయినట్టే. అయితే, బంగారం ధరల్లో తీవ్ర హెచ్చతగ్గులుంటాయి కాబట్టి, మళ్లీ అనతికాలంలోనే ధర పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ, కొనే సమయంలో సెంటిమెంటు మాత్రం ప్రస్తుతానికి బాండ్లకు వ్యతిరేకమే.

More Telugu News