: వ్యూహం మార్చిన డ్రాగన్!... భారత ప్రభుత్వ బాండ్లకు ఎగబడుతున్న చైనా

‘డ్రాగన్’గా పిలుచుకునే చైనా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అత్యంత బలమైనదే. మొన్నటిదాకా కేవలం అగ్ర రాజ్యం అమెరికా, దానికి సమాంతరంగా ఉన్న యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన ఆర్థిక వ్యవస్థల్లోనే చైనా పెట్టుబడులు పెట్టింది. ఆయా దేశాల ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేస్తూ తనదైన శైలిలో సత్తా చాటింది. తాజాగా డ్రాగన్ తన వ్యూహం మార్చింది. అమెరికా, ఈయూ దేశాలను వదిలి ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థపై కన్నేసింది. కన్నేయడమేంటి, ఏకంగా భారత ప్రభుత్వ బాండ్లనే డ్రాగన్ కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే భారత ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసేందుకు ఆ దేశ కేంద్ర బ్యాంకు ‘‘పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (పీబీఓసీ)’’ సెబీ వద్ద విదేశీ పోర్టుపోలియో ఇన్వెస్టర్ గా నమోదు చేసుకుంది. చాపకింద నీరులా ఇప్పటికే పీబీఓసీ 50 కోట్ల డాలర్ల విలువ చేసే భారత ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక గతంలో ఎన్నడూ భారత ప్రభుత్వ బాండ్లను చైనా కొనుగోలు చేయలేదు. భారత ప్రభుత్వ బాండ్లను డ్రాగన్ కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. మున్ముందు మరింత పెద్ద మొత్తంలో భారత ప్రభుత్వ బాండ్లను చైనా కొనుగోలు చేయడం ఖాయమేనని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

More Telugu News