: హిందూ యువతిని పెళ్లి చేసుకోనున్న జామా మసీదు జూనియర్ ఇమాం!

ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ కుమారుడు, జూనియర్ ఇమామ్ షబాన్ బుఖారీ ఓ హిందూ యువతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్యా గత రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తుండగా, తొలుత వివాహానికి అంగీకరించని షబాన్ తండ్రి, ఆ అమ్మాయి ముస్లిం మతం స్వీకరిస్తుందని, ప్రస్తుతం ఖురాన్ నేర్చుకుంటున్నదని తెలిసి అంగీకారాన్ని తెలిపారట. ఈ యువతి ఎవరన్న విషయం ఇంకా బయటకు పొక్కనప్పటికీ, నవంబర్ 13న వివాహం నిశ్చయమైందని పలు ఆంగ్ల, హిందీ పత్రికలు వార్తలను ప్రచురించాయి. అమిటీ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పొందిన షబాన్ ను గత సంవత్సరం నవంబర్ లో జామా మసీదు నయీబ్ ఇమాన్ గా ప్రకటించారు. అంటే, దేశంలోని అతిపెద్ద మసీదైన జామా మసీదుకు అతని తండ్రి తరువాత ప్రధాన ఇమామ్ గా ఆయనపై బాధ్యతలు పడతాయి. ఇదిలా ఉంచితే, ఈ వార్తలన్నీ అవాస్తవాలని, యూపీలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న వేళ షాహీ ఇమామ్, ఆయన కుటుంబ పరువు తీసేందుకు ఈ తరహా వార్తలు కల్పిస్తున్నారని జామా మసీద్ ఆఫీస్ ఇన్ చార్జ్ అమానుల్లా వ్యాఖ్యానించారు.

More Telugu News