: బీహార్ లో బీజేపీదే అధికారం: తాజా సర్వే

త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్ లో అధికారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిదేనని జీ న్యూస్ నిర్వహించిన తాజా సర్వే అభిప్రాయపడింది. బీహార్ లో బీజేపీకి 53.8 శాతం ఓట్లు, 187 సీట్లు వస్తాయని, మహా కూటమికి 64 సీట్లు, 40.2 శాతం ఓట్లు రావచ్చని, ఇక ఇతరుల స్థానం నామమాత్రమేనని తెలిపింది. నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (ఎన్డీయే)లో భాగంగా జితన్ రామ్ మాంఝీ, రామ్ విలాస్ పాశ్వాన్, ఉపేంద్ర కుశాహ్వ తదితర నేతలు ముఖ్యమంత్రి పదవికి గట్టి పోటీ పడుతున్నారని తెలిపింది. వీరి నేతృత్వంలోని హెచ్ఏఎం, ఎల్జేపీ, ఆర్ఎస్ఎల్పీలు చేతులు కలిపి పోటీలో నిలువగా, ఆర్జేడీ, జనతాదళ్ యునైడెట్, కాంగ్రెస్, జనతాదళ్ పార్టీలు మహా కూటమిగా అవతరించిన సంగతి తెలిసిందే. ఇక బీహార్ లో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 54.6 శాతం మంది ఎన్డీయే కూటమికి, 39.7 శాతం మంది నితీష్ కుమార్ నేతృత్వంలోని కూటమికి అనుకూలంగా ఉన్నట్టు సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఏ పార్టీకి అవకాశాలున్నాయని, బీహార్ రాజకీయాల్లో శక్తిమంతమైన యాదవుల వర్గాన్ని అడగగా, 50 శాతానికి పైగా మహా కూటమి విజయం సాధిస్తుందని తెలుపగా, ఎన్డీయే గెలుస్తుందని 43.7 శాతం మంది వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కులాలు, ప్రాంతాల వారీగా సర్వే జరిపామని, ముస్లింలలో 35.9 శాతం మంది మాత్రమే మోదీ బ్యాచ్ కి అనుకూలంగా ఉన్నారని తెలిపింది. హిందువుల్లో 57 శాతానికి పైగా ఎన్డీయేను కోరుతుండటం ఆ పార్టీలకు కలిసొచ్చే అంశమని వెల్లడించింది. కాగా, బీహారులో 243 అసెంబ్లీ స్థానాలుండగా, అక్టోబర్ 12న ఎన్నికలు తొలి విడత మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఆపై 16, 28, నవంబర్ 1, 5 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

More Telugu News