జగన్ నన్ను రాజ్యసభకు పంపించారు... తప్పుడు ప్రచారం బాధ కలిగిస్తోంది: గొల్ల బాబూరావు
- వైసీపీని వీడుతున్నానన్న ప్రచారంలో నిజం లేదన్న బాబూరావు
- తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం బాధను కలిగిస్తోందని వ్యాఖ్య
- నీతి, నిజాయతీ కలిగిన వ్యక్తిత్వం తనదన్న బాబురావు
తాను దళితుడిని కాబట్టే తనపై ఇలా ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనపై తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. పార్టీ మారుతానంటూ జరుగుతున్న ప్రచారం ఎంతో బాధిస్తోందని తెలిపారు.
వైఎస్ కుటుంబంతో తనకు వ్యక్తిగతంగా ఎంతో అనుబంధం ఉందని బాబూరావు చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు ఎమ్మెల్యే పదవి ఇస్తే... జగన్ తనను రాజ్యసభకు పంపించారని అన్నారు. వైఎస్ మరణించిన తర్వాత తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని... జగన్ పట్ల తాను ఎంతో నిబద్ధతతో ఉంటానని చెప్పారు.
నీతి, నిజాయతి కలిగిన వ్యక్తిత్వం తనదని అన్నారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని... వైసీపీలోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోతే చంద్రబాబుకు వ్యతిరేకంగా తాను ప్రచారం చేస్తానని తెలిపారు.