వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి సత్యకుమార్ కీలక ఆదేశాలు

AP Minister Satya Kumar Key Orders on seasonal diseases
  • సీజనల్ వ్యాధుల నియంత్రణపై అధికారులతో మంత్రి సమీక్ష
  • అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశం
  • వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు ఉమ్మడి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించిన మంత్రి సత్యకుమార్
ఏపీలో వైరల్ జ్వరాలు, డయేరియా తదితర లక్షణాలతో వేలాది మంది బాధపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలాది మంది చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నియంత్రణపై సచివాలయం నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. డెంగ్యూ, మలేరియా, డయేరియా తదితర సీజనల్ వ్యాధులకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 
 
అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, పర్యావరణ పరిశుభ్రతపైనా జాగ్రత్తలు తీసుకోవాలని, దీనికి సంబంధించి పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని, ఉమ్మడి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పారు. మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఆయిల్ బాల్స్ వేసి దోమల పెరుగుదలను అరికట్టే చర్యలు తీసుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో దోమ తెరలు పంపిణీ, వాడకంపై పలు సూచనలు చేశారు. ప్రభుత్వ హాస్టల్ లో తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు ఇచ్చారు.
Go Back to Shorts
AP Minister
Satya Kumar Yadav
ap news

More Telugu News