Hemangi Sakhi: ప్రధాని మోదీపై పోటీ చేస్తున్న ట్రాన్స్జెండర్.. ఎవరీ హేమాంగి సఖి మాత!
![Transgender Mahamandaleshwar Hemangi Sakhi from ABHM to contest against PM Modi from Varanasi](https://imgb.ap7am.com/thumbnail/cr-20240409tn6614cf26d228b.jpg)
- వారణాసి నియోజకవర్గం నుంచి బరిలో ఏబీహెచ్ఎంకు చెందిన హేమాంగి సఖి మాత
- ప్రపంచంలోనే భగవద్గీతను బోధిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్జెండర్
- 2019లో ఆచార్య మహామండలేశ్వర్గా పట్టాభిషిక్తులైన హేమాంగి సఖి
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే నియోజకవర్గం నుంచి ఆయనపై ఓ ట్రాన్స్జెండర్ కూడా పోటీ చేస్తుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అఖిల భారత హిందూ మహాసభ (ఏబీహెచ్ఎం) కు చెందిన హేమాంగి సఖి మాత బరిలో నిలిచారు. గుజరాత్ లోని బరోడా (నేటి వడోదర)లో జన్మించిన ఆమె ప్రపంచంలోనే భగవద్గీతను బోధిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్జెండర్ కావడం విశేషం.
2019లో ఆమె ఆచార్య మహామండలేశ్వర్గా పట్టాభిషిక్తులయ్యారు. కాగా, ఆమె తండ్రి ఓ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కావడంతో వారి కుటుంబం ముంబైకి మారిపోయింది. కాగా, గొప్ప ఆధ్యాత్మికపరురాలిగా ఉన్న ఆమె పోటీతో హిందూత్వ నినాదాన్నే ఊపిరిగా చేసుకుని ముందుకు సాగుతున్న బీజేపీకి ఎంతవరకూ ఇబ్బంది అవుతుంది అన్న చర్చ సాగుతోంది.
ఇక ఇప్పటివరకు రెండు ఎన్నికల్లోనూ నరేంద్ర మోదీకి ప్రధాన పోటీదారులుగా ఉన్న ఇటు ఆప్ కానీ అటు ఎస్పీ కానీ సెక్యూలర్ భావజాలంతో ముందుకు సాగిన వారు. దాంతో హిందూత్వ అన్న నినాదం ఏకమొత్తంగా బీజేపీ పరం అయ్యేది. ఇప్పుడు హిందూ మహాసభ బీజేపీకి పోటీగా అభ్యర్ధిని పెట్టడం, అందులోనూ హేమాంగి సఖి మాత వంటి వారు పోటీకి ముందుకు రావడంతో అందరూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
బీజేపీ భావజాలంతోనే హిందూ మహా సభ ఉన్నా ఎందుకు ప్రధాని మోదీపైనే పోటీ పెడుతోంది అన్నది కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది. ఏది ఏమైనా ఎవరీ హేమాంగ్ సఖి మాత అని నెటిజన్లు ఇపుడు ఆమె కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే బలమైన నేతగా ఉన్న మోదీని ఢీ కొనడం అంటే ఆషామాషీ కాదు.