Balineni Srinivasa Reddy: గన్ మెన్లు, ఎస్కార్ట్ లేకుండానే తాడేపల్లికి వెళ్లిన బాలినేని.. కారణం ఇదే!

Ballineni Srinivasa Reddy went to Tadepalli without gunmen

  • పోలీసు అధికారులు తన మాటను పట్టించుకోవడం లేదంటూ బాలినేని అసంతృప్తి
  • తన గన్ మెన్లను వెనక్కి పంపించిన వైనం
  • మధ్యాహ్నం 3 గంటలకు సీఎంను కలిసే అవకాశం

తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్ మెన్లు, ఎస్కార్ట్ లేకుండానే ఆయన తాడేపల్లికి వెళ్లారు. ప్రకాశం జిల్లా పోలీసులపై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. జిల్లాలో జరుగుతున్న భూకబ్జాలపై ఏర్పాటు చేసిన సిట్... అసలైన నిందితులను అరెస్ట్ చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన నిందితులు ఎవరో తాను చెప్పినప్పటికీ జిల్లా ఎస్పీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోలేదంటూ ఆయన తన గన్ మెన్లను వెనక్కి పంపించారు. తనకు గన్ మెన్లు అవసరం లేదని స్పష్టం చేశారు. అనంతరం ఒంగోలు నుంచి హైదరాబాద్ కు వచ్చారు. పార్టీలో కూడా తన మాటకు విలువ లేకుండా పోయిందని ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.

మరోవైపు తాడేపల్లికి వచ్చిన బాలినేని... సీఎంఓ అధికారి ధనుంజయరెడ్డితో సమావేశమయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంది. సీఎం జగన్ ప్రస్తుతం కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని ఆయన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్న తర్వాత బాలినేని కలిసే అవకాశం ఉంది. 

  • Loading...

More Telugu News