Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ గడువు మరో ఐదు రోజులు పొడిగింపు

Visakha Steel Plant bidding time limit extended
  • విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 22 సంస్థలు బిడ్ల దాఖలు
  • వాటిలో 6 విదేశీ సంస్థలు!
  • బిడ్డింగ్ లో పాల్గొన్న ఉక్రెయిన్ వ్యక్తి
  • సింగరేణి సంస్థ నుంచి ఇంకా దాఖలు కాని బిడ్
  • రేసులో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
విశాఖ ఉక్కు పరిశ్రమ బిడ్ల దాఖలు గడువును ఆర్ఐఎన్ఎల్ మరో ఐదు రోజులు పొడిగించింది. పలు సంస్థల నుంచి ఇంకా బిడ్లు వస్తాయనే అంచనాతో గడువు పొడిగింపు నిర్ణయం తీసుకుంది. 

విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ కు ఇటీవల ఈఓఐ (ఆసక్తి వ్యక్తీకరణ) జారీ చేయగా... ఇప్పటిదాకా 22 బిడ్లు దాఖలైనట్టు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ఈఓఐకి స్పందించి 6 విదేశీ సంస్థలు కూడా బిడ్లు వేసినట్టు సమాచారం. ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి కూడా బిడ్డింగ్ వేసినట్టు భావిస్తున్నారు. 

ఈ బిడ్డింగ్ లో జేఎస్ డబ్ల్యూ, జేఎస్పీఎల్ వంటి అగ్రగామి సంస్థలు పాల్గొన్నాయి. సింగరేణి కాలరీస్ నుంచి ఇంకా బిడ్ దాఖలు కాలేదు. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనడంపై సింగరేణి సంస్థ మరికొంత సమయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 

విశాఖకు చెందిన పలు సంస్థలు కూడా బిడ్లు దాఖలు చేశాయి. ఈ బిడ్డింగ్ లో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా పాల్గొనడం తెలిసిందే. ఆయన ఓ ప్రైవేటు సంస్థ తరఫున బిడ్ దాఖలు చేశారు. స్టీల్ ప్లాంట్ సీజీఎం సత్యానంద్ కు బిడ్డింగ్ పత్రాలు సమర్పించారు.
Vizag Steel Plant
Bidding
EOI
Andhra Pradesh

More Telugu News