Kurnool District: కర్నూల్ తాలూకా పీఎస్‌లో రూ. 80 లక్షల విలువైన వెండి అదృశ్యం

80 lakhs worth of silvers goes missing in Kurnool Taluk police station

  • పోలీసులే వెండిని మాయం చేసి పంచుకున్నట్టు దర్యాప్తులో నిర్ధారణ
  • ఈ వ్యవహారంలో ఓ పోలీసు కీలకంగా వ్యవహరించినట్టు వెల్లడి
  • జువెలరీ షాపులో ఓ కానిస్టేబుల్ విక్రయించిన వెండిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

కర్నూల్ తాలూకా పీఎస్‌లో 80 లక్షల విలువైన వెండి అదృశ్యం కావడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారుల విచారణలో పలు నివ్వెరపోయే విషయాలు బయటపడ్డాయి. పోలీసులే వెండి కాజేసి పంచుకున్నట్టు నిర్ధారణ అయ్యింది. 

పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద 2021 జనవరి 28న జరిగిన వాహన తనిఖీల సందర్భంగా 105 కిలోల వెండి, రూ. 2.05 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్నంతా కర్నూలు తాలుకా పీఎస్‌లో అప్పగించారు. కొన్నాళ్ల తరువాత వ్యాపారులు ఈ వెండిని రిలీజ్ చేయాలంటూ కోర్టు ఆదేశాలతో పోలీసులను ఆశ్రయించారు. అయితే.. పోలీస్ స్టేషన్‌లో వెండి కనిపించడంలేదని సమాధానం రావడంతో వ్యాపారులు అవాక్కయ్యారు.

ఈ విషయమై అక్కడి పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఇక గతేడాది కర్నూలు తాలుకాఫీసులో నలుగురు పోలీసు అధికారులు బదిలీపై వెళ్లారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు ఆ పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన నలుగురు సీఐలను విచారించారు. 

పోలీసులే ఈ మొత్తాన్ని తాలూకా పోలీసులే మాయం చేసి పంచుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారుల దర్యాప్తులో నిర్ధారణ అయింది. ఇందులో ఓ పోలీసు కీలకంగా వ్యవహరించారని ప్రచారం జరుగుతోంది. కర్నూలులోని ఓ జువెలరీ షాపులో ఓ కానిస్టేబుల్ విక్రయించిన 45 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

Kurnool District
  • Loading...

More Telugu News