Somu Veerraju: సోము వీర్రాజు తీరుపై అసంతృప్తి.. బీజేపీ నేత శివప్రకాష్‌జీతో కన్నా భేటీ

Kanna Lakshminarayana met BJP National Leader Shiv Prakashji

  • సోము వీర్రాజుపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం
  • అదేమీ లేదని కొట్టిపడేసిన కన్నా
  • పార్టీ మారడం లేదని మొత్తుకుంటున్నా మీడియా వినిపించుకోవడం లేదని ఆగ్రహం 

బీజేపీ నేత, ఆ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గత రాత్రి విజయవాడలో పార్టీ జాతీయ నాయకుడు శివప్రకాష్‌జీతో సమావేశం కావడం చర్చనీయాంశమైంది. ఢిల్లీలో ఇటీవల జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, భీమవరంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు దూరంగా ఉన్న కన్నా.. అనూహ్యంగా ప్రకాష్‌జీతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరూ దాదాపు గంటన్నరపాటు మాట్లాడుకున్నారు. 

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై గత కొంతకాలంగా గుర్రుగా ఉన్న కన్నా ఆయనపై శివప్రకాష్‌జీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఎవరినీ సంప్రదించకుండానే పార్టీ జిల్లా అధ్యక్షులను మార్చేశారని, ఫలితంగా కొందరు రాజీనామా చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. సమావేశం అనంతరం కన్నా మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలోని ప్రస్తుత పరిస్థితులపైనే ఆయనతో చర్చించినట్టు తెలిపారు. 

సోము వీర్రాజు మీద ఫిర్యాదు చేయలేదన్నారు. తాను పార్టీ మారడం లేదని పదేపదే చెబుతున్నా మీడియా మాత్రం అదే పనిగా ఆ వార్తలను ప్రసారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన నేత నాదెండ్లను ఓ స్నేహితుడిగా మాత్రమే కలిశానని, అది కూడా తప్పే అంటే ఎలా? అని ప్రశ్నించారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్న వారికి అవమానాలు జరుగుతున్నాయని కన్నా ఆవేదన వ్యక్తం చేశారు.

Somu Veerraju
Kanna Lakshminarayana
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News