కాలిఫోర్నియా మళ్లీ రక్తసిక్తం.. కాల్పుల్లో ఏడుగురి మృతి

7 dead after shooting in Californias Half Moon Bay
  • కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే పట్టణంలో ఘటన
  • తోటి కార్మికులను కాల్చి చంపిన 67 ఏళ్ల వృద్ధుడు
  • మృతులు చైనాకు చెందిన వ్యవసాయ కార్మికులు
చైనా న్యూ ఇయర్ వేడుకల రోజు జరిగిన కాల్పుల ఘటనను మర్చిపోకముందే కాలిఫోర్నియాలో మరోమారు తుపాకి గర్జించింది. ‘హాప్ మూన్ బే’ పట్టణంలో జరిగిన కాల్పుల ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మూడు రోజుల వ్యవధిలో రెండోసారి కాల్పలు జరగడం గమనార్హం.

అమెరికా మీడియా ప్రకారం.. ఈ కాల్పుల్లో చైనాకు చెందిన వ్యవసాయ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అనుమానితుడిని 67 ఏళ్ల వ్యవసాయ కూలీ జావో చున్లీగా గుర్తించారు. తోటి వర్కర్లపై కాల్పులు జరిపిన అనంతరం జావో అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్నాడని, మరేం భయం లేదని శాన్ మేటో కౌంటీ పోలీసులు తెలిపారు.  

హాఫ్ మూన్ బే సబ్‌స్టేషన్‌లోని పార్కింగ్ ప్లేస్‌లో తన వాహనంలో ఉండగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, అతడి కారులో ఎలాంటి ఆయుధం దొరకలేదని పేర్కొన్నారు. కాల్పులు సరిగ్గా ఎక్కడ జరిగాయన్న విషయం కానీ, కాల్పులకు గల స్పష్టమైన కారణం కానీ తెలియరాలేదు. 

కాగా, కాలిఫోర్నియాలోని మోంటెరీ పార్క్‌లో మొన్న చైనా న్యూ ఇయర్ వేడుకల్లో జరిగిన కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. ఆ తర్వాత నిందితుడు ఓ వ్యాన్‌లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అతడిని చుట్టుముట్టారు. దీంతో అతడు తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Advertisement
America
China
California
Half Moon Bay

More Telugu News