వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లు రువ్విన ఆగంతుకులు.. ప్రారంభించిన నాలుగు రోజులకే ఘటన

Stones pelted at Howrah bound Vande Bharat Express train
  • డిసెంబరు 30న రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
  • హౌరా-న్యూ జల్పాయిగురి మధ్య నడుస్తున్న రైలు
  • ప్రయాణికులతో తొలి ప్రయాణం ప్రారంభించిన రోజే ఘటన
  • దాడిలో పగిలిన కిటికీ అద్దాలు
పశ్చిమ బెంగాల్‌లోని హౌరా వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రైలు కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి. మాల్దాలోని కుమార్‌గంజ్ స్టేషన్‌లో జరిగిందీ ఘటన. ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిసెంబరు 30న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో ఈ రైలును ప్రారంభించారు. ఇది దేశంలోని ఏడో వందేభారత్ రైలు. హౌరా-న్యూ జల్పాయిగురి స్టేషన్ల మధ్య ఇది నడుస్తోంది. రైలును ప్రారంభించి నాలుగు రోజులు కూడా కాకముందే దుండగులు ఈ రైలుపై రాళ్లతో దాడిచేశారు. ప్రయాణికులతో తొలి ప్రయాణం ప్రారంభించిన రోజే ఈ దాడి జరగడం గమనార్హం. 

రైలు కుమార్‌గంజ్ స్టేషన్‌ను దాటుతున్న సమయంలో దాడి జరిగినట్టు ఈస్టర్న్ రైల్వే తెలిపింది. దుండగులు బయటి నుంచి రాళ్లు విసిరారని, అద్దాలు పగిలాయని రితు ఘోష్ అనే ప్రయాణికుడు తెలిపాడు. రైలు మాల్దా స్టేషన్‌కు చేరుకోవడానికి ముందు ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నాడు. అయితే, ఈ దాడిలో రైలులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని, ఈ ఘటనతో తాము షాకయ్యామని వివరించాడు. ఈ రాళ్ల దాడి ఎవరు చేశారు? ఎందుకు చేశారన్న విషయంలో స్పష్టత లేదు. రాళ్లదాడి ఘటనపై విచారణకు ఆదేశించినట్టు రైల్వే అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Vande Bharat Express
West Bengal
Howrah
New Jalpaiguri
Stone Pelting

More Telugu News