solar eclipse: 25న సూర్యగ్రహణం హైదరాబాద్​ లో ఎప్పుడు, ఎన్ని నిమిషాలు కనిపిస్తుందంటే..!

Hyderabad will witness Partial Solar Eclipse on Oct 25
  • దేశంలో పలు నగరాల్లో కనిపించనున్న పాక్షిక సూర్య గ్రహణం
  • సూర్యుడు, భూమి మధ్యలోకి రానున్న చంద్రుడు
  • తిరిగి భారత్ లో 2032లోనే కనిపించనున్న గ్రహణం
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ నెల 25న పాక్షిక సూర్య గ్రహణం కనిపించనుంది. ఆ రోజు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే కక్ష్యలోకి రానున్నాయి. దీంతో చంద్రుడి నీడ భూమిపై పడుతుంది. దీన్ని సూర్యగ్రహణంగా చెబుతారు. మన దేశంలో పలు నగరాల్లో ఈ సూర్య గ్రహణం చూడవచ్చు. మన దేశం నుంచి ఇలాంటి సూర్య గ్రహణాన్ని మరో పదేళ్లలో చూడగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాక్షిక సూర్యగ్రహణం తిరిగి 2025 మార్చి 29న చోటు చేసుకోనుంది. కాకపోతే దీన్ని మనం వీక్షించలేం. 2032 నవంబర్ 3న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం మన దేశంలో కనిపిస్తుంది. 

కాగా, ఈ నెల 25న ఏర్పడే గ్రహణం సమయంలో భారతదేశంలోని ప్రజలు 43 శాతం సూర్యుడిని అస్పష్టంగా చూడగలుగుతారు. కంటికి రక్షణనిచ్చే ప్రత్యేక సౌర సాధనాలతో దీనిని చూడొచ్చు. కోల్‌కతాలోని ఎంపీ బిర్లా ప్లానిటోరియం ప్రకారం సూర్యాస్తమయానికి కొన్ని నిమిషాల నుంచి ఒక గంట ముందు భారత దేశంలోని పశ్చిమ, మధ్య ప్రాంతాలలో కనిపిస్తుంది. హైదరాబాద్ లో సాయంత్రం 4 గంటల 49 నిమిషాల నుంచి గ్రహణాన్ని వీక్షించవచ్చు. 49 నిమిషాల పాటు గ్రహణం కనిపిస్తుంది. 

పోర్‌బందర్, గాంధీనగర్, ముంబై, సిల్వాసా, సూరత్, పనాజీ వంటి తీవ్ర పశ్చిమ నగరాల్లో గ్రహణం గంటకు పైగా ఉంటుంది. మొత్తంగా వచ్చే మంగళవారం గరిష్ఠంగా 1 గంట 45 నిమిషాల నిడివిని కలిగి గుజరాత్‌లోని ద్వారకలో ఎక్కువ భాగం కనిపిస్తుంది. ఐజ్వాల్, దిబ్రూఘర్, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, సిల్చార్, అండమాన్ అండ్ నికోబార్ ద్వీపం వంటి ఈశాన్య ప్రాంతాల నుంచి గ్రహణం కనిపించదు.
solar eclipse
25th october
hyderabad
visible
india
moon
sun

More Telugu News