Janasena: వెలగని వీధి లైట్లు... జనసైనికుల సెల్ఫోన్ల లైటింగ్తో పవన్ ర్యాలీ
![pawan kalyan rally in vizag continues in the lighting of party cadre mobule phones](https://imgb.ap7am.com/thumbnail/cr-20221015tn634aafe5d4d44.jpg)
- ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు విశాఖ చేరుకున్న పవన్
- ఎయిర్పోర్టు నుంచి కళావేదికకు ర్యాలీగా బయలుదేరిన వైనం
- దారిలో వెలగని వీధి లైట్లు
- జన సైనికుల మొబైళ్ల లైటింగ్లోనే సాగిన ర్యాలీ
ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన నిమిత్తం శనివారం సాయంత్రం విశాఖ చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఆ పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. అదే సమయంలో విచిత్ర పరిస్థితులు కూడా ఆయనకు స్వాగతం పలికాయి. శనివారం సాయంత్రం చీకటిపడే సమయంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్... ఎయిర్ పోర్టు నుంచి బీచ్ రోడ్డులోని నోవాటెల్ కు ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా పవన్ ర్యాలీ సాగే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా స్ట్రీట్ లైట్లు వెలగలేదు. అయినా కూడా వెనక్కు తగ్గని పవన్ కల్యాణ్ చీకట్లోనే ర్యాలీతో ముందుకు సాగారు.
రేపు విశాఖ పోర్టులోని కళావేదికలో జనసేన ఉత్తరాంధ్ర జనవాణిని పవన్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. విమానాశ్రయం నుంచి నోవాటెల్ కు బయలుదేరిన పవన్ వెంట భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరాయి. పవన్ కాన్వాయ్కు ముందుగా జన సైనికులు బైక్ ర్యాలీతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా స్ట్రీట్ లైట్లు వెలగని విషయాన్ని గమనించిన జనసేన శ్రేణులు తమ సెల్ ఫోన్లలోని లైటింగ్ను ఆన్ చేశారు. ఈ సెల్ ఫోన్ల లైటింగ్లోనే పవన్ ర్యాలీ సాగింది.