YSRCP: నాకు ప్రాణహాని ఉంది... నాకు ఏం జరిగినా సీఎం జగన్దే బాధ్యత!: వివేకా కేసు అప్రూవర్ దస్తగిరి
![ys videka murder case approver dastagiri afraid of his life](https://imgb.ap7am.com/thumbnail/cr-20221010tn634422028f8d8.jpg)
- కడప ఎస్పీ కార్యాలయానికి వచ్చిన దస్తగిరి
- తనకు కేటాయించిన గన్ మెన్లను ఉన్న పళంగా మార్చారని ఆరోపణ
- వైసీపీ నేతలు తనపై వరుసగా కేసులు పెట్టిస్తున్నారని ఆవేదన
- తన విజ్ఞప్తులను కడప ఎస్పీ పట్టించుకోవడం లేదన్న దస్తగిరి
వైసీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన ఆయన మాజీ డ్రైవర్ దస్తగిరి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసులో అప్రూవర్గా మారిన తర్వాత వైసీపీ నేతలు తనను లక్ష్యంగా చేసుకుని వరుసగా కేసులు పెట్టిస్తున్నారని అతడు ఆరోపించాడు. ఈ క్రమంలో తనకు ప్రాణహాని ఉందని, తన ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లినా సీఎం జగన్ బాధ్యత వహించాలని అతడు పేర్కొన్నాడు. ఈ మేరకు సోమవారం కడప ఎస్పీ కార్యాలయానికి వచ్చిన దస్తగిరి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
తనకు భద్రత కల్పించాలని కడప ఎస్పీకి దస్తగిరి విజ్ఞప్తి చేశాడు. సీబీఐ ఏఎస్పీ రాంసింగ్ సూచనల మేరకే తాను ఎస్పీ కార్యాయానికి వచ్చానని తెలిపాడు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తనకు కేటాయించిన గన్మన్లను మార్చారని అతడు ఆరోపించాడు. తనకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, సరైన భద్రత కల్పించాలన్న విషయంపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కడప ఎస్పీ పట్టించుకోవడం లేదని దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశాడు.