Alay Balay: ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆపాటి అసూయ పడటం పరిపాటే: నాగబాబు
![nagababu satirical post on garikapati mohan rao](https://imgb.ap7am.com/thumbnail/cr-20221006tn633edc09dff5d.jpg)
- అలయ్ బలయ్లో చిరుపై అసహనం వ్యక్తం చేసిన గరికపాటి
- గరికపాటిపై వ్యంగ్యాత్మక పోస్ట్ను సంధించిన నాగబాబు
- సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన నాగబాబు పోస్ట్
దసరా వేడుకల్లో భాగంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె, బీజేపీ నేత విజయలక్ష్మి గురువారం హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై అసహనం వ్యక్తం చేసిన ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై మెగా బ్రదర్ నాగేంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. గరికపాటిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ సింగిల్ సెంటెన్స్తో కూడిన పోస్ట్ను పెట్టారు.
ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆపాటి అసూయ పడటం పరిపాటే.. అంటూ నాగబాబు తన పోస్ట్లో పేర్కొన్నారు. తన సోదరుడికి దక్కిన ఇమేజీని చూసి గరికపాటి అసూయపడ్డారనే అర్థం వచ్చేలా నాగబాబు సెటైరిక్ పోస్ట్ను ప్రయోగించారు. అయితే ఈ పోస్ట్ లో గరికపాటి పేరును నాగబాబు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఈ పోస్ట్పై సోషల్ మీడియాలో ఓ రేంజిలో చర్చ సాగుతోంది.