Mobile Immersion: హైదరాబాదులో ఇంటివద్దే వినాయక నిమజ్జనం... చిన్న గణపయ్యల కోసం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన మొబైల్ నీటితొట్టెలు ఇవిగో!
![GHMC deploys mobile immersion vehicles in Hyderabad](https://imgb.ap7am.com/thumbnail/cr-20220903tn63136047187ee.jpg)
- హైదరాబాదులో వేల సంఖ్యలో వినాయక విగ్రహాలు
- మట్టితో చేసిన చిన్న విగ్రహాల కోసం మొబైల్ పాండ్స్
- ప్రజల అభ్యర్థన మేరకు ఆయా ప్రాంతాలకు నీటి తొట్టెలు
- ప్రారంభించిన మంత్రి తలసాని, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్
తెలుగు రాష్ట్రాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఎప్పట్లాగానే హైదరాబాదులో భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో ఏర్పాటు చేసే గణేశ్ వ్రిగహాల నిమజ్జనం ఎంతో ప్రయాసతో కూడిన పని. అందుకే, చిన్న వినాయక విగ్రహాల కోసం జీహెచ్ఎంసీ ఎకో ఫ్రెండ్లీ విసర్జన్ పేరిట కొత్త కార్యాచరణ సిద్ధం చేసింది. ఇంటి వద్దే నిమజ్జనం పేరిట చిన్న విగ్రహాల కోసం ప్రత్యేకంగా నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక వాహనాలను కూడా అందుబాటులో ఉంచుతోంది.
ఫ్రీడమ్ ఆయిల్ గ్రూప్ తో కలిసి జీహెచ్ఎంసీ ఈ తరలించే వీలున్న నీటి తొట్టెలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మట్టితో చేసిన చిన్న విగ్రహాలను ఏర్పాటు చేసిన ప్రజల అభ్యర్థనల మేరకు ఈ వాహనాలను, నీటి తొట్టెలను ఆయా ప్రాంతాలకు తరలిస్తారు. ఈ మొబైల్ నిమజ్జనం వాహనాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్ నిన్న ప్రారంభించారు.
![](https://img.ap7am.com/froala-uploads/20220903fr6313603b9fa67.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220903fr6313639e19b1f.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220903fr631363b71a76c.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220903fr631363c998710.jpg)