Telangana: రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ నాశనమైంది: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
![komatireddy venkat reddy complains about revanth reddy to sonia gandhi](https://imgb.ap7am.com/thumbnail/cr-20220822tn630395b96dea6.jpg)
- సోనియా గాంధీకి లేఖ రాసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- తనకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపణ
- మాణిక్కం ఠాగూర్ దొంగ నాటకాలాడుతున్నారని నివేదన
- ఏఐసీసీ సమావేశానికి గైర్హాజరీపైనా వివరణ ఇచ్చిన ఎంపీ
మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సోమవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టి హైదరాబాద్ తిరిగి వచ్చేసిన పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాసేపటి క్రితం స్పందించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరిన వెంటనే పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఆయన ఓ లేఖ రాశారు. ఆ లేఖను మీడియాకు విడుదల చేసిన ఆయన... లేఖలో ప్రస్తావించిన అంశాలను వెల్లడించారు.
రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ నాశనమైందని సదరు లేఖలో తాను సోనియాకు ఫిర్యాదు చేసినట్లు వెంకట్ రెడ్డి తెలిపారు. సోమవారం నాటి ఏఐసీసీ సమావేశానికి హాజరు కాకపోవడానికి గల కారణాలను లేఖలో ప్రస్తావించినట్లు తెలిపారు. ఎంపీగా ఉన్న తనకు కనీస సమాచారం లేకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఈ తరహా చర్యలతో తనను ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారని తెలిపారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా ఉన్న మాణిక్కం ఠాగూర్ దొంగ నాటకాలాడుతున్నారని కూడా సోనియాకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.