Parliament: సస్పెన్షన్ ఉత్తర్వులను చించివేస్తూ బహిష్కరణకు గురైన ఎంపీల నిరసన... వీడియో ఇదిగో
![suspended congress mps tore the suspension order from Loksabha Secretariat](https://imgb.ap7am.com/thumbnail/cr-20220726tn62dfb015d93d4.jpg)
- ఎల్పీజీ ధరల పెంపు, నిత్యావసరాలపై చర్చ జరగాల్సిందేనని డిమాండ్
- పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ఎంపీల నిరసన
- లోక్ సభ నుంచి సస్పెండైన మాణిక్కం ఠాగూర్, రమ్య హరిదాస్, జ్యోతి మణి, టీఎన్ ప్రతాపన్
లోక్ సభలో సభా నిబంధనావళిని అతిక్రమిస్తూ పోడియం ముందు నిరసనకు దిగారన్న కారణంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల నుంచి బహిష్కరణకు గురైన నలుగురు కాంగ్రెస్ ఎంపీలు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. సోమవారం సభ నుంచి సస్పెండ్ అయిన వెంటనే పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగిన ఎంపీలు... మంగళవారం గాంధీ విగ్రహం ముందు కూర్చుని నిరసనను కొనసాగించారు.
ఈ సందర్భంగా తమను పార్లమెంటు వర్షాకాల సమావేశాల నుంచి బహిష్కరిస్తూ లోక్ సభ సెక్రటేరియట్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులను చించి వేస్తూ వారు తమ నిరసనను కొనసాగించారు. సోమవారం నాటి సమావేశాల్లో గ్యాస్ ధరల పెంపు, నిత్యావసరాలపై జీఎస్టీ విధింపుపై కాంగ్రెస్ పార్టీ చర్చకు పట్టుబట్టింది. ఈ సందర్భంగా ఆ పార్టీకి చెందిన ఎంపీలు మాణిక్కం ఠాగూర్, జ్యోతిమణి, రమ్య హరిదాస్, టీఎన్ ప్రతాపన్లు ప్లకార్డులు చేతబట్టి వెల్లోకి దూసుకువెళ్లారు.
పోడియాన్ని చుట్టుముట్టడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని స్పీకర్ ఎంతగా చెప్పినా వారు వినిపించుకోలేదు. ఈ క్రమంలో నలుగురు ఎంపీలను పార్లమెంటు వర్షాకాల సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం నాటి నిరసనలోనూ ఎల్పీజీ ధరల పెంపు, నిత్యావసరాలపై జీఎస్టీ విధింపుపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని, పార్లమెంటే ఈ సమస్యలపై చర్చా వేదిక అని కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు.