KTR: తుమ్మల, పొంగులేటిలను పార్టీ వదులుకోదు: కేటీఆర్
![ktr says that trs will not loose seniors like tummala and ponguleti](https://imgb.ap7am.com/thumbnail/cr-20220611tn62a4a4990df2a.jpg)
- ఖమ్మం జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశం
- గెలుపు గుర్రాలకే టికెట్లన్న మంత్రి
- సిట్టింగులందరికీ సీట్లు అనుకోవడం సరికాదని వ్యాఖ్య
- పార్టీకి సీనియర్ల అవసరం ఉందని వెల్లడి
- ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలన్న కేటీఆర్
2023 అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నేతలను పార్టీ వదులుకోదని చెప్పిన కేటీఆర్... పార్టీకి సీనియర్ల అవసరం ఉందని చెప్పారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను పార్టీ వదులుకోదని కూడా కేటీఆర్ చెప్పారు.
శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన కేటీఆర్...ఖమ్మంలో పార్టీకి చెందిన జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే ఆయన తుమ్మల, పొంగులేటిల అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు చెప్పిన కేటీఆర్... ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని చెప్పారు. సిట్టింగులందరికీ సీట్లు వస్తాయని అనుకోవడం సరికాదని కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు.