Andhra Pradesh: అప్పు చేసే పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం.. ఏపీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు
![ap deputy cm mutyala naidu comments on debts and funds allocations](https://imgb.ap7am.com/thumbnail/cr-20220418tn625d913fc2d40.jpg)
- టీడీపీ హయాంలో అప్పులు చేయలేదా? అని ప్రశ్నించిన డిప్యూటీ సీఎం
- నిధులను దారి మళ్లించలేదని చెప్పగలరా? అంటూ నిలదీత
- నీరు, చెట్టు పథకంలో కోట్ల నిధులు ఎక్కడికెళ్లాయన్న ముత్యాల నాయుడు
ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు, పేదలకు సంక్షేమ పథకాలకు నిధుల లభ్యతపై ఏపీ కేబినెట్లో కొత్తగా డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన బూడి ముత్యాల నాయుడు సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పులు చేసే పేదవాడికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా పంచాయతీ నిధులను అవసరం మేరకు ప్రభుత్వం వినియోగించుకోవడం కొత్తేమీ కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
సోమవారం పలు అంశాలపై మీడియాతో మాట్లాడిన సందర్భంగా ముత్యాలనాయుడు.. అప్పులు చేయకుండానే టీడీపీ పాలన సాగిందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని పథకాలు సక్రమంగా అమలవుతున్నా విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. టీడీపీ హయాంలో నిధుల దారి మళ్లింపు జరగలేదని చంద్రబాబు, యనమల రామకృష్ణుడు చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు. నీరు చెట్టు మట్టి తవ్వకాల్లో వేల కోట్ల రూపాయలు ఎక్కడికిపోయాయని చంద్రబాబుని ముత్యాలనాయుడు ప్రశ్నించారు.