ATM Van: రూ.36 లక్షలతో ఉడాయించిన ఏటీఎం వ్యాన్ డ్రైవర్

ATM van driver theft cash in Hyderabad
  • హైదరాబాదులో ఘటన
  • యూటర్న్ తీసుకుని వస్తానని వాహనంతో పరారీ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇతర సిబ్బంది
ఓ ఏటీఎం వ్యాన్ డ్రైవర్ రూ.36 లక్షలతో పరారైన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. సాగర్ (25) అనే డ్రైవర్ ఈ చర్యకు పాల్పడ్డాడు. సాగర్ ఇటీవలే ఏటీఎంలలో డబ్బులు నింపే రైటర్స్ అనే సంస్థలో చేరాడు. రైటర్స్ సంస్థ కార్యాలయం బేగంపేటలో ఉంది. అయితే, నగరంలోని పలు ఏటీఎంలలో డబ్బు నింపేందుకు రైటర్స్ సంస్థ వ్యాన్ ను పంపించింది. ఆ వ్యాన్ కు సాగర్ డ్రైవర్.

తొలుత జీడిమెట్ల యాక్సిస్ బ్యాంకులో రూ.13 లక్షలు జమచేశారు. ఆ తర్వాత దుండిగుల్ సాయిబాబా నగర్ లో ఉన్న యాక్సిస్ బ్యాంకు ఏటీఎం వద్ద నగదు నింపేందుకు వెళ్లారు. ఇతర సిబ్బంది వాహనం దిగి ఏటీఎంలోకి వెళ్లగా, వ్యాన్ ను యూటర్న్ చేసుకుని వస్తానని సాగర్ అందులోని డబ్బుతో ఉడాయించాడు.

అతడు ఎంతకీ రాకపోవడంతో ఇతర సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా నర్సాపూర్ రోడ్డు వద్ద ఏటీఎం వ్యాన్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులోని రూ.36 లక్షలు సాగర్ ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. సాగర్ ఫోన్ స్విచాఫ్ అని వస్తుండడంతో, అతడిపై అనుమానాలు మరింత బలపడ్డాయి.
ATM Van
Driver
Cash
Theft
Hyderabad

More Telugu News