KXIP: పోతూ పోతూ పంజాబ్ ను కూడా వెంట తీసుకెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్

KXIP lost to Chennai Super Kings in much needed win situations
  • అబుదాబిలో చెన్నై వర్సెస్ పంజాబ్
  •  పంజాబ్ పై 9 వికెట్ల తేడాతో నెగ్గిన చెన్నై
  •  తాజా ఓటమితో పంజాబ్ అవకాశాలకు తెర
అబుదాబిలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ను ఓడించింది. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలవాలని ఆశించిన పంజాబ్ జట్టు ఆశలపై చెన్నై నిర్దాక్షిణ్యంగా నీళ్లు చల్లింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ధోనీసేన పోతూ పోతూ తమ వెంట పంజాబ్ ను కూడా తీసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో ఓటమితో పంజాబ్ జట్టు నాకౌట్ అవకాశాలకు తెరపడింది. ఓవరాల్ గా ఆ జట్టు ఐదోస్థానంలో నిలిచింది.

చెన్నై-పంజాబ్ పోరులో టాస్ ఎంతో కీలకంగా మారింది. బౌలర్లు మైదానంలోని తేమ కారణంగా బంతిపై పట్టు కోల్పోతుండడం ఛేజింగ్ చేసే జట్లకు లాభిస్తోంది. ఇవాళ కూడా పంజాబ్ బౌలర్లు బంతిని గ్రిప్ చేయలేక అవస్థలు పడగా, చెన్నై టాపార్డర్ చితకబాదింది.

మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. పెద్దగా కష్టసాధ్యం కాని లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 154 పరుగులు చేసి విజయభేరి మోగించింది. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 49 బంతుల్లో 62 పరుగులు చేయగా, మరో ఓపెనర్ డుప్లెసిస్ 34 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సులతో 48 పరుగులు చేశాడు. తెలుగుతేజం అంబటి రాయుడు మరోసారి నిలకడగా ఆడి  30 బంతుల్లో 30 పరుగులు చేసి జట్టు సాఫీగా విజయతీరం చేరడంలో సహకరించాడు. పంజాబ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ కు ఒక వికెట్ లభించింది.

కాగా, దుబాయ్ లో జరిగే మ్యాచ్ లో నేడు కోల్ కతా రైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కోల్ కతా జట్టులో ఆండ్రీ రస్సెల్ తిరిగొచ్చాడు. పేసర్ లాకీ ఫెర్గుసన్ ను తప్పించి శివమ్ మావిని జట్టులోకి తీసుకున్నారు. ఇక రాజస్థాన్ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. స్టోక్స్ భీకర ఫామ్ లో ఉండడం ఆ జట్టుకు కలిసొస్తోంది.

More Telugu News

KXIP
CSK
Play Offs
IPL 2020