Lover: కరోనా సోకిందంటూ జూన్ 24న అదృశ్యమైన భర్త... ప్రేయసితో ఉన్నాడని తేల్చిన పోలీసులు!

Man went with his Lover after Phone Call to Wife

  • చనిపోతున్నానని భార్యకు ఫోన్ చేసి స్విచ్చాఫ్
  • ఫోన్, ఇతర వస్తువులు సరస్సు వద్ద వదిలేసి ప్రేయసితో ఇండోర్ కు
  • మృతదేహం లభ్యం కాకపోవడంతో సీసీటీవీ ఫుటేజ్ లు వెతికిన పోలీసులు
  • ముంబైలో జరిగిన ఘటన

తనకు కరోనా సోకిందని, ఇక బతకబోనని భార్యకు ఫోన్ చేసి, ఆపై దాన్ని స్విచ్చాఫ్ చేసిన ప్రబుద్ధుడు, ప్రేయసితో కలిసి పారిపోయిన ఘటన ముంబైలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జూన్ 24న పోలీసుల దృష్టికి రాగా, అతను ప్రియురాలితో కలిసి ఉన్నాడని తేల్చడానికి పోలీసులకు దాదాపు మూడు నెలల సమయం పట్టింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, ఓ ప్రైవేటు కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న మనీశ్ మిశ్రా, జూన్ లో తన భార్యకు ఫోన్ చేసి, కరోనా పాజిటివ్ వచ్చిందని, చచ్చిపోతున్నానని చెప్పి, ఫోన్ ను స్విచ్చాఫ్ చేశాడు.

దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె, భర్త ఏ అఘాయిత్యం చేసుకున్నాడోనన్న భయంతో పోలీసులను ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, అతని సెల్ ఫోన్ చివరిగా మాట్లాడిన ప్రాంతాన్ని సిగ్నల్స్ సాయంతో గుర్తించి వెళ్లగా, అతని బైక్, ఇతర వస్తువులు లభించాయి. ఆ పక్కనే ఓ సరస్సు ఉండటంతో, అతను అందులో దూకి ఉండవచ్చని భావించిన పోలీసులు, జాలర్ల సాయంతో తనిఖీలు జరిపించారు. ఎన్ని రోజులు వెతికించినా, మృతదేహం ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో అతను బతికే ఉండవచ్చని నమ్మిన పోలీసులు, మరో మార్గంలో విచారణ చేపట్టారు.

ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను అన్నింటినీ జల్లెడ పట్టడం ప్రారంభించారు. చాలా రోజుల తరువాత వారి ప్రయత్నం ఫలించింది. మనీశ్ మిశ్రా, ఓ మహిళతో కలిసి కారులో వెళుతున్నట్టు గుర్తించి, అతని గత చరిత్రపై విచారించగా, ఓ మహిళతో వివాహేతర బంధం ఉన్నట్టు తేలిపోయింది. దీంతో కేసును పరిష్కరించడం వారికి సులువైంది. అతను తన ప్రియురాలితో కలిసి ఇండోర్ లో ఎంజాయ్ చేస్తున్నాడని తేల్చిన పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకుని, ముంబైకి తీసుకుని వచ్చి, భార్య ముందు నిలిపారు.

Lover
Wife
Corona Virus
Sucide
Mumbai
Police
  • Loading...

More Telugu News