Karimnagar: అంబులెన్సు లేదన్నారు.. కుమార్తె మృతదేహాన్ని చేతులతో మోసుకెళ్లిన తండ్రి!

  • కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించిన బాలిక
  • అంబులెన్స్ చెడిపోయిందని చేతులెత్తేసిన అధికారులు
  • ఏడుస్తూనే మృతదేహాన్ని తీసుకెళ్లిన తండ్రి
అనారోగ్యంతో మరణించిన బిడ్డ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు, ప్రభుత్వ వైద్యాధికారులు అంబులెన్స్ ను ఏర్పాటు చేయకపోవడంతో, తండ్రి చేతులపై ఆమెను మోస్తూ బయలుదేరిన ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలానికి చెందిన సంపత్ కుమార్తె, కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉండగా, చికిత్స చేయించేందుకు స్తోమతలేని సంపత్, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాడు. బాలిక ఆరోగ్యం క్షీణించి, ఆమె మరణించగా, చేతిలో డబ్బులేని సంపత్, కనీసం అంబులెన్స్ ను ఇవ్వాలని అధికారుల ముందు ప్రాధేయపడ్డాడు. వాహనం బాగాలేదని అధికారులు చేతులెత్తేయడంతో, ఏడుస్తూనే, బిడ్డ మృతదేహాన్ని చేతులపై తీసుకుని, ఆటో స్టాండ్ వరకూ వెళ్లాడు. డబ్బులు లేవని, తన ఊరికి తీసుకెళ్లాలని ఆటో డ్రైవర్లను బతిమాలుకున్నాడు. చివరకు ఓ డ్రైవర్ మానవత్వం చూపించి, వారిద్దరినీ స్వగ్రామానికి చేర్చాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, గ్రామస్థులు అధికారుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
Karimnagar
Govt Hospital
Died
Ambulence

More Telugu News