West Bengal: మ్యాచ్ లో ఓడిపోయారట... ఆటగాళ్లకు గుండు గీయించిన బెంగాల్ కోచ్!

  • 1-5 తేడాతో ఓడిపోయిన బెంగాల్ అండర్ 19 హాకీ జట్టు
  • 16 మంది క్రీడాకారులకు గుండు గీయించిన కోచ్ ఆనంద్
  • విచారణకు ఆదేశించిన బెంగాల్ హాకీ అసోసియేషన్
క్రీడల్లో గెలుపు, ఓటములు చాలా సహజం. కానీ, తాను కోచింగ్ ఇచ్చిన జట్టు ఓడిపోయిందన్న ఆగ్రహంతో ఆటగాళ్లకు గుండు చేయించాడో కోచ్. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, బెంగాల్ అండర్ -19 హాకీ టీమ్, ఇటీవల ఓ మ్యాచ్ లో ఓడిపోయింది. దాంతో కోచ్ ఆనంద్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఆటగాళ్లకు గుండు చేయించాడు. ఈ విషయం బయటకు పొక్కి విమర్శలు వెల్లువెత్తడంతో బీహెచ్ఏ (బెంగాల్‌ హాకీ అసోసియేషన్) విచారణకు ఆదేశించింది. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించినట్లు బీహెచ్‌ఏ కార్యదర్శి స్వపన్‌ బెనర్జీ ప్రకటించారు.

కాగా, జూనియర్‌ నేషనల్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో భాగంగా జబల్‌ పూర్‌ లో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగగా, బెంగాల్‌ అండర్‌–19 జట్టు 1–5 తేడాతో నామ్‌ ధారి ఎలెవన్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. ఆపై జట్టులో 18 మంది ఆటగాళ్లలో 16 మంది గుండుతో కనిపించారు. అయితే, తాను ఆగ్రహం వ్యక్తం చేసిన మాట వాస్తవమేగానీ, గుండు చేయించుకోవాలని ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని ఆనంద్ అంటుండటం గమనార్హం.
West Bengal
Hockey
Players
Coach

More Telugu News