జపానే కాదు... నేపాల్ కూడా మన మామిడిపై నిషేధం!

  • భారత్ నుంచి మామిడి దిగుమతులపై నేపాల్ ప్రభుత్వం ఆంక్షలు
  • పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం
  • స్థానిక రైతులకు మద్దతిచ్చేందుకే ఈ నిర్ణయమని అధికారుల వెల్లడి
  • ధరలు పెరిగి, కొరత ఏర్పడుతుందని వ్యాపారులు ఆందోళన
భారత్ నుంచి దిగుమతి అవుతున్న మామిడి పండ్లలో పురుగుమందుల అవశేషాలు మోతాదుకు మించి ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత మామిడి దిగుమతులపై ఆ దేశం ఆంక్షలు విధించింది. సరిహద్దుల్లోని క్వారంటైన్ కేంద్రాల్లో సరైన పరీక్షా సదుపాయాలు లేకపోవడం కూడా ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని అధికారులు పేర్కొన్నారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు స్థానిక రైతులకు వెన్నుదన్నుగా నిలిచే ఉద్దేశంతో ఏప్రిల్-మే నెలల నుంచే ఈ ఆంక్షలను అమలులోకి తెచ్చారు. ఇప్పటికే జపాన్ భారత్ మామిడిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

ఈ నిర్ణయంతో నేపాల్‌ స్థానిక మార్కెట్లలో భారత మామిడి స్థానంలో దేశీయంగా పండిన పండ్లు అధికంగా లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా మధేశ్ రాష్ట్రంలోని సిరహా, సప్తరి, ధనుషా జిల్లాల్లో పండిన మామిడి పండ్లకు గిరాకీ గణనీయంగా పెరిగింది. ఇది స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించే సానుకూల పరిణామమని మధేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారి అజయ్ గ్యావలీ తెలిపారు. అయితే, దేశీయ ఉత్పత్తి ఏడాది పొడవునా దేశవ్యాప్త అవసరాలకు సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ నిర్ణయంపై వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశీయ ఉత్పత్తి పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుందని, దిగుమతులు నిలిచిపోతే తీవ్ర కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఖాట్మండు మార్కెట్‌లో కిలో మామిడి ధర నేపాలి కరెన్సీలో రూ. 100 నుంచి రూ. 150 మధ్య ఉంది. గతంలో అరటిపండ్ల దిగుమతులపై ఆంక్షలు విధించినప్పుడు డజను ధర రూ. 120 నుంచి ఏకంగా రూ. 300కి చేరిన విషయాన్ని వ్యాపారులు గుర్తుచేస్తున్నారు. తాజా ఆంక్షల ప్రభావం మామిడి ఆధారిత జ్యూస్ పరిశ్రమలపైనా పడే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు.

Indian Mangoes
Nepal Import Ban
Pesticide Residue
Madhesh Province
Nepal India Trade
Mango Price Hike

More Telugu News