సొంత ఇల్లు కలేనా? భారతీయులకు భారమవుతున్న ఖర్చులు!
- రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే ఇల్లు కొనడం మరింత కష్టతరం
- దక్షిణ ఆసియాలో ఆదాయం, ఇంటి ధరల నిష్పత్తి 9.7 నుంచి 16.8కి పెరుగుదల
- ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో 20 శాతానికి పైగా పెరిగిన ఆస్తుల ధరలు
- పట్టణీకరణకు తగ్గట్టుగా ఇళ్ల సరఫరా లేకపోవడమే ప్రధాన కారణం
- అద్దెదారులలో 44 శాతం మంది ఆదాయంలో 30 శాతానికి పైగా అద్దెకే చెల్లింపు
ఐరాస నివేదిక ప్రకారం, వేగవంతమైన పట్టణీకరణ, జనాభా పెరుగుదల కారణంగా గృహాలకు తీవ్రమైన కొరత ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా 2010లో ఆదాయానికి, ఇంటి ధరకు మధ్య నిష్పత్తి (ప్రైస్-టు-ఇన్ కమ్ రేషియో) 9.5గా ఉండగా, 2023 నాటికి అది 11.7కు చేరింది. భారత్ సహా దక్షిణాసియాలో ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఇక్కడ ఈ నిష్పత్తి 9.7 నుంచి ఏకంగా 16.8కి పెరిగింది. ఇది ప్రజల ఆదాయం కంటే ఇళ్ల ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో తెలియజేస్తోంది.
భారత్లోని ప్రధాన నగరాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ముంబైలో ఆదాయ-ధరల నిష్పత్తి 14.3గా, ఢిల్లీలో 10.1గా ఉంది. అంటే, మధ్యతరగతి కుటుంబాలు అధికారిక మార్గాల ద్వారా ఇల్లు కొనడం దాదాపు అసాధ్యంగా మారింది. చాలా మంది తమ పొదుపు, కుటుంబ సభ్యుల సహాయం లేదా అనధికారిక అప్పులపై ఆధారపడుతున్నారు. 2026 జనవరి-మార్చి త్రైమాసికంలో బెంగళూరులో చదరపు అడుగు ధర 24 శాతం పెరిగి రూ.9,785కు, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో 20 శాతం పెరిగి రూ.15,120కు చేరింది.
ఇక అద్దె ఇళ్లలో నివసించే వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అద్దెకు ఉంటున్న వారిలో దాదాపు 44 శాతం మంది తమ ఆదాయంలో 30 శాతానికి పైగా ఇంటి అద్దెకే చెల్లిస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్కు తగినట్టుగా ఇళ్ల నిర్మాణం జరగకపోవడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంది. నిర్మాణ ఖర్చులు, ప్రభుత్వ నిబంధనల్లో జాప్యం వంటివి సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. కేవలం సబ్సిడీ గృహాలతో ఈ సమస్య తీరదని, గృహ నిర్మాణాన్ని భారీగా పెంచడంతో పాటు, రవాణా, ఉపాధి, సామాజిక భద్రతతో గృహ రంగ విధానాలను అనుసంధానం చేయాలని ఐక్యరాజ్యసమితి నివేదిక సూచించింది. లేనిపక్షంలో, రాబోయే రోజుల్లో సొంత ఇల్లు అనేది కోట్లాది మందికి తీరని కలగానే మిగిలిపోతుందని హెచ్చరించింది.