రిఫండ్‌లో జాప్యం.. విద్యార్థినికి రూ.74,131 పరిహారం చెల్లించనున్న ఎయిరిండియా

Air India to pay 74131 compensation to student for refund delay
  • మహారాజా స్కాలర్ స్కీమ్ ప్రయోజనాన్ని నిరాకరించిన ఎయిరిండియా
  • విద్యార్థిని నుంచి అదనపు బ్యాగేజీ ఫీజు వసూలు
  • రీఫండ్ ఇస్తామని చెప్పి ఏళ్ల తరబడి ఆలస్యం చేసిన వైనం
  • రూ. 74,131 చెల్లించాలని ఆదేశించిన రాజస్థాన్ వినియోగదారుల కమిషన్
  • మానసిక క్షోభకు పరిహారం పెంచిన రాష్ట్ర కమిషన్
విద్యార్థినికి చేరాల్సిన ప్రయోజనాలను నిరాకరించడంతో పాటు, రిఫండ్ చెల్లింపులో తీవ్ర జాప్యం చేసిన ఎయిరిండియా సంస్థపై రాజస్థాన్ వినియోగదారుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలైన విద్యార్థినికి రూ. 74,131 పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

జైపూర్‌కు చెందిన లావణ్య మాగోన్ అనే విద్యార్థిని యూకేలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. 2021 జులైలో ఆమె లండన్ నుంచి భారత్‌కు వస్తున్న సమయంలో, అదనపు లగేజీ కోసం ఎయిరిండియా 350 బ్రిటిష్ పౌండ్లు (అప్పటి భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 34,131) వసూలు చేసింది. అంతర్జాతీయ విద్యార్థుల కోసం అమలు చేస్తున్న 'మహారాజా స్కాలర్ స్కీమ్' కింద తనకు అదనపు లగేజీ వెసులుబాటు ఉందని ఆమె వాదించినప్పటికీ, సిబ్బంది పట్టించుకోలేదు.

అనంతరం లావణ్య పలుమార్లు ఎయిరిండియా యాజమాన్యాన్ని సంప్రదించగా, 2021 సెప్టెంబరులో ఆమె ఈ రాయితీకి అర్హురాలేనని సంస్థ అంగీకరించింది. రిఫండ్ నిమిత్తం బ్యాంకు వివరాలను సేకరించినప్పటికీ, నగదును మాత్రం ఖాతాలో జమ చేయలేదు. ఎయిరిండియా ధోరణితో విసిగిపోయిన బాధితురాలు చివరకు వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు.

ఈ కేసుపై విచారణ చేపట్టిన జిల్లా కమిషన్, 2024 ఫిబ్రవరిలో రూ. 34,131 రిఫండ్‌తో పాటు, మానసిక క్షోభకు రూ. 4,000, న్యాయపరమైన ఖర్చుల కింద రూ. 3,000 చెల్లించాలని తీర్పునిచ్చింది. అయితే, తాను అనుభవించిన ఇబ్బందులతో పోలిస్తే ఈ పరిహారం చాలా తక్కువని భావించిన ఆమె, రాష్ట్ర కమిషన్‌లో అప్పీల్ చేశారు.

కేసును పునఃసమీక్షించిన రాష్ట్ర కమిషన్, మానసిక వేదనకు ఇచ్చే పరిహారాన్ని రూ. 30,000కు, కేసు ఖర్చులను రూ. 10,000కు పెంచింది. దీంతో ఎయిరింండియా చెల్లించాల్సిన మొత్తం రూ. 74,131కి చేరింది. ఇటువంటి ఉదంతాల్లో కేవలం ఆర్థిక నష్టాన్ని మాత్రమే కాకుండా, బాధితులు ఎదుర్కొన్న వేధింపులు, మానసిక క్షోభను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కమిషన్ తన తీర్పులో స్పష్టం చేసింది.
Go Back to Shorts
Air India
Lavanya Magon
Rajasthan Consumer Commission
Maharaja Scholar Scheme
Airline refund compensation

More Telugu News