నారా లోకేష్ రష్యా పర్యటనపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనం
- లోకేష్ రష్యా పర్యటనపై 'ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' కథనం
- సెయింట్ పీటర్స్బర్గ్ ఆర్థిక వేదికలో పాల్గొన్న మంత్రి లోకేష్
- ఏఐ, స్మార్ట్ సిటీలు, తయారీ రంగాల్లో పెట్టుబడుల కోసం చర్చలు
- తిరుపతి స్పేస్ సిటీ ప్రాజెక్టును రష్యా వేదికగా ప్రమోట్ చేసిన లోకేష్
- తక్షణ ఒప్పందాలు లేనప్పటికీ భవిష్యత్ సహకారానికి బలమైన పునాది
సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆర్థిక వేదిక (SPIEF) 2026 సదస్సులో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్యా ప్రభుత్వ ప్రతినిధులు, ప్రముఖ కంపెనీలతో ఆయన ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రంలో అల్యూమినా స్మెల్టర్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టిన 'రుసాల్' (RUSAL) వంటి సంస్థలతో ఉన్న భాగస్వామ్యాన్ని సమీక్షించారు. అల్యూమినియం విలువ ఆధారిత ఉత్పత్తులు, ఆటోమోటివ్, ఏరోస్పేస్ మిశ్రమ లోహాలు, ఫాయిల్ ఉత్పత్తి వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించుకోవడంపై చర్చించారు.
పర్యటనలో భాగంగా ఇంధనం, లాజిస్టిక్స్, రవాణా, రైల్వేల తయారీ, క్రిటికల్ మినరల్స్, సెమీకండక్టర్లు, డిజిటల్ మౌలిక సదుపాయాల వంటి అనేక రంగాలకు చెందిన ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు. ముఖ్యంగా, మాస్కో రవాణా శాఖ మంత్రి, వైస్ మేయర్ మాగ్జిమ్ లిక్సుటోవ్తో భేటీ అయి, ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థలు, స్మార్ట్ రవాణా పరిష్కారాలపై చర్చించారు. సెయింట్ పీటర్స్బర్గ్ అధికారులతో సురక్షితమైన, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల నిర్మాణంలో సహకారం గురించి మాట్లాడారు.
టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి అంశాలకు ఈ పర్యటనలో పెద్దపీట వేశారు. రష్యాకు చెందిన ప్రముఖ 'స్బేర్బ్యాంక్' (Sberbank) నాయకత్వంతో ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆవిష్కరణలపై చర్చలు జరిపారు. 'స్కూల్ 21', 'స్బేర్సిటీ' వంటి సంస్థలను సందర్శించి అక్కడి నూతన ఆవిష్కరణల గురించి తెలుసుకున్నారు. అలాగే, తతార్స్థాన్ రిపబ్లిక్తో పారిశ్రామిక, వాణిజ్య సహకారంపై చర్చలు జరిపినట్లు 'ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' తన కథనంలో పేర్కొంది.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, "భారత్, రష్యా మధ్య దీర్ఘకాలంగా విశ్వసనీయ భాగస్వామ్యం ఉంది. SPIEF 2026 సదస్సులో మా చర్చలు పరిశ్రమలు, టెక్నాలజీ, స్మార్ట్ సిటీలు, ఏఐ, అత్యాధునిక తయారీ రంగాల్లో కొత్త సహకారానికి మార్గం వేశాయి," అని తెలిపారు. మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, స్థిరమైన విధానాలతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ తయారీ, టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'స్పేస్ పాలసీ 4.0'ను, శ్రీహరికోట సమీపంలో 3000 ఎకరాల్లో నిర్మించతలపెట్టిన 'తిరుపతి స్పేస్ సిటీ' ప్రాజెక్టును కూడా లోకేష్ బృందం ప్రమోట్ చేసింది. స్పేస్ టెక్నాలజీ, సెమీకండక్టర్లు, డ్రోన్లు, క్వాంటం కంప్యూటింగ్ వంటి రంగాల్లో సుమారు 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో డ్రోన్ల కదలికల వంటి భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నప్పటికీ, లోకేష్ బృందం తమ లక్ష్యాలను పూర్తి చేసేందుకు పర్యటనను విజయవంతంగా కొనసాగించింది. పర్యటన ముగిసిన వెంటనే నిర్దిష్టంగా కొత్త ఒప్పందాలు ఏవీ కుదిరినట్లు అధికారికంగా ప్రకటించనప్పటికీ, భవిష్యత్ సహకారానికి, పెట్టుబడులకు ఈ పర్యటన బలమైన పునాది వేసిందని 'ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' కథనం విశ్లేషించింది.