పశ్చిమ బెంగాల్లో పార్టీలో సంక్షోభం.. తృణమూల్ కాంగ్రెస్ ఏమన్నదంటే?
- మమత నాయకత్వాన్ని పొగిడినవారే, ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన
- ఇది అధికారం కోసం చేస్తున్న ద్రోహమని టీఎంసీ చీఫ్ విప్ వ్యాఖ్య
- తృణమూల్ కాంగ్రెస్లో తీవ్రమైన అంతర్గత సంక్షోభం
- ఎన్డీఏకు మద్దతిస్తామంటూ 20 మంది ఎంపీల తిరుగుబాటు
పశ్చిమ బెంగాల్లో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సుమారు 20 మంది లోక్సభ ఎంపీలు, పార్లమెంటులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసినట్లు రెబల్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తిదార్ ప్రకటించారు.
రాష్ట్రంలో 15 ఏళ్ల టీఎంసీ పాలనకు తెరదించుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమి అనంతరం పార్టీలో అసమ్మతి జ్వాలలు మిన్నంటాయి. ఇప్పటికే 58 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు పార్టీ అధికారిక శాసనసభాపక్ష నేత అభ్యర్థిని కాదని, బహిష్కరణకు గురైన నేతకు మద్దతు తెలపడం గమనార్హం.
తాజాగా ఈ సంక్షోభం పార్లమెంటుకు సైతం పాకింది. పార్టీలో పెరుగుతున్న అవినీతి, సీనియర్ నేతలను విస్మరించడం, మమత కుటుంబ సభ్యుల ఆధిపత్యమే ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణాలని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. పలువురు రెబల్ ఎంపీలు ఇప్పటికే కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్, బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారితో సమావేశమయ్యారు.