ఏఐ టెక్నాలజీపై టీసీఎస్ ఛైర్మన్ మరింత క్లారిటీ
- ఏఐతో ఐటీ రంగానికి ముప్పులేదన్న టీసీఎస్ ఛైర్మన్
- ఉద్యోగులకు సమానంగా ఏఐ ఏజెంట్లను నియమిస్తామని ప్రకటన
- రాబోయే మూడేళ్లలో ఇది సాధ్యమవుతుందని చంద్రశేఖరన్ ధీమా
- మానవ మేధస్సు, ఏఐ భాగస్వామ్యంతోనే భవిష్యత్ అని స్పష్టీకరణ
- ఇప్పటికే ఏఐ ప్రాజెక్టుల ద్వారా కంపెనీకి భారీ ఆదాయం
మంగళవారం జరిగిన టీసీఎస్ 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో చంద్రశేఖరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐ రాకతో సంప్రదాయ ఐటీ సేవల నమూనాలకు ఆటంకం కలుగుతుందన్న ఆందోళనలను ఆయన తోసిపుచ్చారు. "ఏఐ అనేది ఐటీ పరిశ్రమకు ముప్పు కాదు. టీసీఎస్లో ఉద్యోగుల సంఖ్యకు సమానంగా ఏఐ ఏజెంట్లు ఉండే రోజు ఎంతో దూరంలో లేదు" అని ఆయన స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్లలోనే ఇది సాధ్యపడొచ్చని ఆయన అంచనా వేశారు.
ప్రస్తుతం టీసీఎస్లో సుమారు 5.84 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, వీరిలో 2.17 లక్షల మందికి పైగా అధునాతన ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ పొందారు. ఏఐ ద్వారా కంపెనీ వార్షిక ఆదాయం ఇప్పటికే 2.5 బిలియన్ డాలర్లకు చేరువలో ఉందని, వందలాది జనరేటివ్ ఏఐ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు.