రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులు ఏటీఎంలుగా మారాయి: రాంచందర్ రావు

  • ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వంపై రాంచందర్ రావు విమర్శలు
  • ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్రం నిర్వహించదని వ్యాఖ్య
  • కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు

తెలంగాణలో ధాన్యం కొనుగోలు వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భువనగిరి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ధాన్యం దిగుబడుల అంచనాలను రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, కేంద్రానికి సరైన ఇండెంట్ పంపలేకపోయిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్రం నిర్వహించదని, రాష్ట్రాలు కొనుగోలు చేసిన ధాన్యానికి కేంద్రమే రీయింబర్స్‌మెంట్ అందిస్తుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్త సేకరణలో దాదాపు 50 శాతం తెలంగాణ నుంచే జరిగినప్పటికీ.. కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.


రైతుల సమస్యలను పక్కనబెట్టి, వాస్తవాలను దాచిపెడుతూ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. ఇదే క్రమంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మూసి ప్రక్షాళన ప్రాజెక్టులు సీఎం రేవంత్ రెడ్డికి ‘ఏటీఎం’లుగా మారాయని రాంచందర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. తాము మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, కేవలం ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టుకే తమ అభ్యంతరమని స్పష్టం చేశారు.


కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేసే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని, అలాగే కాళేశ్వరం అవినీతి అంశంలో కేసీఆర్‌ను కాపాడేందుకే ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆయన ఆరోపించారు.

Go Back to Shorts

More Telugu News