అది పవిత్ర రంజాన్ మాసంలో జరిగిన నరమేధం.. ఐరాసలో పాక్ను ఏకిపారేసిన భారత్
- ఆఫ్ఘనిస్థాన్పై పాక్ వైమానిక దాడులను తీవ్రంగా ఖండించిన భారత్
- ఇది ఆఫ్ఘన్ సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా వ్యాఖ్య
- సామాన్య పౌరుల మరణాలపై ఐరాస వేదికగా ఆందోళన
- ఐరాస నివేదికలనే ప్రశ్నించడంపై పాకిస్థాన్కు చురకలు
- రంజాన్ మాసంలో పౌరుల మరణాలపై స్వతంత్ర దర్యాప్తునకు డిమాండ్
ఐరాస సర్వసభ్య సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి, అంబాసిడర్ హరీశ్ పర్వతనేని మాట్లాడుతూ.. పాకిస్థాన్ దాడుల్లో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్థాన్లోని ఐక్యరాజ్యసమితి సహాయ మిషన్ (యూఎన్ఏఎంఏ) నివేదికలను ఆయన ఉటంకించారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 372 మంది పౌరులు మరణించారని, మరో 397 మంది గాయపడ్డారని తెలిపారు. వీరిలో అత్యధికులు పవిత్ర రంజాన్ మాసంలోనే లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో మరణించడం అత్యంత దారుణమని ఆయన పేర్కొన్నారు.
ఇదే సమావేశంలో ఐరాస నివేదికల విశ్వసనీయతను పాకిస్థాన్ ప్రశ్నించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. "బహుళపక్షవాదం, ఐక్యరాజ్యసమితి పట్ల మద్దతు అనేది ఎవరి ఇష్టానుసారం వారు ఎంచుకునే మెనూ కాదు. మీకు నచ్చినప్పుడు దాన్ని స్వీకరించి, నచ్చనప్పుడు తిరస్కరించడం కుదరదు" అని పర్వతనేని పాకిస్థాన్కు గట్టిగా బదులిచ్చారు. ఆఫ్ఘనిస్థాన్లో శాంతి, స్థిరత్వం కోసం యూఎన్ఏఎంఏ చేస్తున్న కృషికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ చట్టాలను, ముఖ్యంగా అంతర్జాతీయ మానవతా చట్టాలను గౌరవించాలని, పౌరుల రక్షణను నిర్ధారించాలని ఐరాస సెక్రటరీ జనరల్ చేసిన పిలుపును భారత్ సమర్థిస్తోందని పర్వతనేని తెలిపారు. ఈ దాడులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి జవాబుదారీతనాన్ని నిర్ధారించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని యూఎన్ఏఎంఏ చేసిన డిమాండ్కు భారత్ మద్దతు తెలుపుతోందని ఆయన వివరించారు. ఇటువంటి దారుణమైన హింసాత్మక చర్యలు ఆమోదయోగ్యం కావని భారత్ స్పష్టం చేసింది.