ఖర్చుల వివరాలు అడిగిన విద్యార్థిని బట్టలూడదీసి కొట్టిన యూనియన్ సభ్యులు!
- కోల్ కతాలోని సెయింట్ పాల్ కేథడ్రాల్ కాలేజీలో ఘటన
- ప్రాధేయ పడుతున్నా వినని విద్యార్థులు
- కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం
సెయింట్ పాల్ కేథడ్రాల్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియోలో, సదరు విద్యార్థి, తననేమీ చేయవద్దని ప్రాధేయ పడుతున్నా వినని మిగతా విద్యార్థులు, బలవంతంగా బట్టలు విప్పి నగ్నంగా నిలబెట్టి కొట్టారు. ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, దీనికి పాల్పడిన వారిపై చర్యలుంటాయని పశ్చిమ బెంగాల్ విద్యా శాఖ మంత్రి పార్థా చటర్జీ వ్యాఖ్యానించారు.
బాధితుడి నుంచి తమకు లిఖిత పూర్వక ఫిర్యాదు అందిందని, ఘటనపై విచారణ ప్రారంభమైందని చెప్పారు. ఇటువంటి ప్రవర్తన సిగ్గు చేటని, నివేదిక రాగానే చర్యలుంటాయని, వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. కాగా, బాధితుడు తొలి సంవత్సరం చదువుతున్న డిగ్రీ విద్యార్థని, తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషద్ లో సభ్యుడని, స్టూడెంట్స్ వింగ్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించగా, ఖర్చుల గురించి అడిగినందునే ఇలా దారుణంగా ప్రవర్తించారని తెలుస్తోంది.