గ్రూప్ 4 నోటిఫికేషన్ పై సన్నాహక సమావేశం నిర్వహించిన తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్

Related image

హైదరాబాద్, మే 19: రాష్ట్రంలో గ్రూప్ 4 పోస్టుల నోటిఫికేషన్ జారీపై నేడు బీఆర్కేఆర్ భవన్ లో ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మెన్ డా. బి.జనార్దన్ రెడ్డితో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రూప్ 4 కేడర్ కింద త్వరలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వం 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం పోస్టులు స్థానికులకే కేటాయించడం జరిగిందని, మిగిలిన ఐదు శాతం కూడా స్థానికులకే దక్కుతాయని సీఎస్ అన్నారు. ఇటీవల, గ్రూప్1 కింద 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియను ప్రారంభించింది. పోలీసు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కూడా కొనసాగుతుండగా, విద్యాశాఖకు కూడా టెట్ నిర్వహణకు క్లియరెన్స్ ఇచ్చినట్లు సీఎస్ తెలిపారు.

గ్రూప్ 4 కు సంబంధించి  రోస్టర్ పాయింట్ల వివరాలతో పాటు సంబంధిత సమాచారాన్ని ఈ నెల 29లోగా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. అన్ని జూనియర్ అసిస్టెంట్ లేదా తత్సమాన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ క్యాడర్‌లలో ఖాళీలను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసి, తద్వారా ఏర్పడ్డ జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను కూడా నోటిఫై చేయాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో హౌజింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, ఏసీబీ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ శివశంకర్, టీఎస్ పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల సీఐజీ శేషాద్రి, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, అటవీ శాఖ పిసిసిఎఫ్ డోబ్రియల్, మరియు ఇతర సీనియర్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు.

More Press Releases