ఓఆర్ఆర్ లోపల ఉన్న 25 మున్సిపాలిటీలను హైదరాబాద్ గా గుర్తించాలి: మంత్రి కేటీఆర్

Related image

రంగారెడ్డి జిల్లా: సోమవారం ఔటర్ రింగ్  రోడ్డు పరిధిలో తాగునీటి సమస్యలను అధిగమిస్తూ శాశ్వత పరిష్కారం కోసం రూ.1200 కోట్లతో చేపడుతున్న ప్రాజెక్ట్ లో భాగంగా 587 కోట్లతో ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్టును రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మణికొండ అల్కాపురిలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మునిసిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో  కలిసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మునిసిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ 978 కాలనీలకు నీళ్లు ఇవ్వాలని మంత్రి సబితారెడ్డి గారు క్యాబినెట్ లో పట్టుబట్టారు. కొండపోచంపల్లి నుంచి గండిపేటకు మంచినీటి సరఫరాకు సీఎం కేసీఆర్ గారు ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కాగానే 2 వేల కోట్లతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకున్నాం. హైదరాబాద్ అంటే జీహెచ్ఎంసీ ఒక్కటే కాదు ఓఆర్ఆర్ లోపల ఉన్న 25 మున్సిపాలిటీలను హైదరాబాద్ గా గుర్తించాలి. హైదరాబాద్ అన్ని నగరాల కంటే వేగంగా విస్తరిస్తోంది. ఢిల్లీ, చెన్నై, ముంబయి నగరాలు వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయి.

హైదరాబాద్ మహానగరంలో 2051 సంవత్సరం నాటికి అవసరమైన వసతుల కోసం ఆలోచన చేస్తున్నాం.. ఆరు వేల కోట్లతో మంచినీటి ప్రాజెక్టులు చేపట్టాం. చెన్నై లాంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. కాళేశ్వరం ఇరిగేషన్ కోసం మాత్రమే కాదు, మల్లన్నసాగర్, కొండ పోచమ్మ రిజర్వాయర్ల ద్వారా నీటిని హైదరాబాద్ తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి అన్నారు.

విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ హెచ్ఎండిఏ పరిధిలోఅభివృద్ధిపై సీఎం కేసీఆర్ గారు దూరదృష్టితో ముందుకు వెళ్తున్నారు. ఒక ప్రత్యేకమైన విజన్ తో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట్టణాభివృద్ధి శాఖమంత్రి కేటిఆర్ గారు నగరాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. తెలంగాణ రాక ముందు వచ్చిన తర్వాత హైదరాబాద్ అభివృద్ధిని ప్రజలు గమనించాలి. మంచినీటి సరఫరాకు 1200 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఒక్క రాజేంద్రనగర్ నియోజకవర్గానికి 250 కోట్లు మంజూరు చేశారు.

నార్సింగ్ దగ్గర ఓఆర్ఆర్ పై వెళ్ళడానికి అవకాశం కల్పించేలా పనులు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు శివార్లలో ఉన్న కార్పొరేషన్లు, మునిసిపాలిటీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. నాళాలు, రోడ్లు, చెరువుల సుందరికరణ, త్రాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణతో అడుగులు వేస్తున్నామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్ రెడ్డి, వాణీదేవి, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జలమండలి ఎం.డిదానకిషోర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

More Press Releases