ఇంటింటి సర్వేను పరిశీలించిన తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్

Related image

హైదరాబాద్, జనవరి 21: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కోవిడ్ మూడవ విడత నివారణకు అన్ని చర్యలను చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఇంటింటికీ ఆరోగ్యం పేరుతొ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటింటి ఫీవర్ సర్వే జరుగుతున్న ప్రక్రియను ఖైరతాబాద్ లోని హిల్ టాప్ కాలనీలో పరిశీలించారు. జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్లు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఎస్ మాట్లాడుతూ, కోవిడ్ మూడవ విడతతోగానీ ఓమైక్రాన్ తోగానీ ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు.

దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తిని పరిశీలిస్తే, క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోందని పేర్కొన్నారు. ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలనైనా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని స్పష్టంచేశారు. ఇప్పటికే, కోటికి పైగా మెడికల్ కిట్ లను సిద్ధంగా ఉంచామని, రోజుకు లక్ష పరీక్షలు చేస్తున్నామని వివరించారు. వారం రోజుల్లోగా పూర్తి చేసే ఈ ఇంటింటి సర్వేకు వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, పంచాయితీ రాజ్ శాఖలకు చెందిన సభ్యులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటిoటికీ ఆరోగ్యం పేరుతో ఇంటింటి ఫీవర్ సర్వే నేడు ప్రారంభమైందని, ఒక్కొక్క టీమ్ లో ఆశా/ ఏ.ఎన్.ఎం/ మున్సిపల్/ పంచాయితీ శాఖ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి ఎవరైనా జ్వరం, దగ్గు తదితర ఇబ్బందులతో ఉన్నారా పరిశీలించి, ఒకవేళ కోవిడ్ లక్షణాలుంటే మెడికల్ కిట్ ను అందచేస్తారని వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రయివేటు తో కలిపి దాదాపు 56 వేల పడకలు ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో సరిపడా ఆక్సిజన్ ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం చేపట్టిన ఈ ఇంటింటి జ్వర సర్వేను నీతిఆయోగ్ కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో వాక్సిన్ ప్రక్రియ విజయవంతంగా నడుస్తోందని అన్నారు. గతంలో రెండు విడతలుగా నిర్వహించిన ఇంటింటి ఫీవర్ సర్వే విజయవంతంగా జరిగి, సత్ఫలితాలను ఇచ్చిందని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 4846 కాలనీల్లో, బస్తీల్లో కూడా ఇంటింటి సర్వే విజయవంతంగా ప్రారంభమైనదని అన్నారు.  ఈ సందర్బంగా, ఖైరతాబాద్ హిల్ టాప్ కాలనీలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే ను సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు.

More Press Releases