"రిలయన్స్ రైజ్" ద్వారా చేనేతలకు చేయూత: సీఈవో ఆనంది దశరాజ్

Related image

  • ఆప్కో చైర్మన్, ఎండీలతో రిలయన్స్ రిటైల్ సీఈవో భేటీ
విజయవాడ: ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ సంస్థ ద్వారా చేనేత వృత్తిదారులకు చేయూతనందించనున్నట్టు ఆ సంస్థ రిటైల్ సీఈవో ఆనంది దశరాజ్ తెలిపారు. మంగళవారం విజయవాడలోని ఆప్కో కేంద్ర కార్యాలయంలో ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పడాల అర్జునరావుతో రిలయన్స్ రిటైల్ సీఈవో ఆనంది దశరాజ్, సీనియర్ టెక్సటైల్ డిజైనర్ కె.కవిత రెడ్డిలు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా రిలయన్స్ రిటైల్ సీఈవో ఆనంది దశరాజ్ మాట్లాడుతూ రిలయన్స్ సంస్థ ద్వారా త్వరలో రైజ్ (రిలయన్స్ ఇండస్ట్రీస్ స్కిల్ ఎన్ హాన్స్మెంట్) సెంటర్లను ఏర్పాటు చేస్తునట్టు తెలిపారు. భారత దేశంతోపాటు ఇతర దేశాలలో కూడా ఈ స్టోర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఈ స్టోర్లలో చేనేత వస్త్రాలను ప్రోమోట్ చేయనున్నామని వివరించారు. ముఖ్యంగా చేనేత కళాకారులకు అత్యాధునిక డిజైన్లు, రంగులలో తర్ఫీదు ఇచ్చి, వృత్తి నైపుణ్యం పెంపొందించి ప్రోత్సహించడమే తమ ప్రధాన ఉద్దేశ్యామన్నారు. ఆంధ్రప్రదేశ్ తోపాటు దేశంలో  తయారవుతున్న చేనేత వస్త్రాలకు రిలయన్స్ ద్వారా విస్తృతమైన మార్కెటింగ్ కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.

ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందించాలని కోరారు. సీనియర్ డిజైనర్ కవితారెడ్డి మాట్లాడుతూ అరటి చెట్ల బెరడు నుంచి ఫైబర్ యారన్ తయారు చేసే ప్రక్రియ గుజరాత్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గంలో నర్మదా నదీ తీరాన విస్తృతంగా కొనసాగుతుందని, మన రాష్ట్రంలో కూడా ఆ విధానం ప్రయోగాత్మకంగా అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే, ఏవైనా శుభకార్యాలు, ఆలయాల్లో వినియోగించే పూలను పారవేయకుండా, వాటి ద్వారా సహజ సిద్ధమైన రంగులను తయారు చేయవచ్చని, ఈ ప్రక్రియ మంచి ఫలితాలను ఇస్తుందని తెలిపారు.

ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు మాట్లాడుతూ రిలయన్స్ స్టోర్లలో ద్వారా చేనేత వస్త్రాలను విక్రయిస్తే నేత కార్మికులకు మరింత మెరుగైన ఉపాధి లభిస్తుందన్నారు. సంస్ధ ఎండి అర్జునరావు మాట్లాడుతూ విక్రయాల పెంపుకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్దాయిలో అందివచ్చే అవకాశాలపై నిరంతరం అధ్యయనం చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆప్కో జీఎం కె. కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

More Press Releases