మార్చి లోగా అన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కులను పూర్తి చేయాలి: తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

Related image

హైదరాబాద్: అవాంతరాలను అధిగమించి వచ్చే మార్చి లోగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కులను పూర్తి చేయాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతికుమారి ఆదేశించారు. అరణ్య భవన్ నుంచి అన్ని జిల్లాల అటవీ శాఖ అధికారులు, అర్బన్ పార్కుల అభివృద్దిలో పాల్గొంటున్న ఇతర శాఖల అధికారులతో శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లో కొంత భాగాన్ని మాత్రమే కనీస సౌకర్యాలతో అర్బన్ పార్కుగా అభివృద్ది చేసి, మిగతా ప్రాంతం అంతటినీ కన్జర్వేషన్ జోన్లుగా తీర్చిదిద్దాలన్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా పార్కుల అభివృద్దికి, ప్లాంటేషన్ లో భాగం అయ్యేందుకు ముందుకు వచ్చే కార్పోరేట్ సంస్థల సహకారాన్ని తీసుకోవాలని తెలిపారు.

జిల్లాల వారీగా ఎక్కడ ఏఏ ఫారెస్ట్ పార్కు ఉంది, ప్రస్తుత దశ, రానున్న రోజుల్లో పూర్తి చేయాల్సిన పనులపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆరా తీశారు. అర్బన్ పార్కుల ఫోటోలు, వీడియోలు, పవర్ పాయింట్ ప్రజంటేషన్ లను చూస్తూ, అధికారులకు తగిన సలహాలు, సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేసి, ప్రజలకు వచ్చే మార్చి కల్లా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో హైదరాబాద్ కు చుట్టుపక్కల హెచ్.ఎం.డీ.ఏ పరిధిలో 59 పార్కులు ఉండగా, వివిధ జిల్లాల్లో 50 పార్కులు ఉన్నాయి. వీటిల్లో 53 పార్కులు ఇప్పటికే పూర్తయ్యాయి. 52 పార్కుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మిగతా నాలుగింటి పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. పార్కుల వారీగా పనుల పురోగతిని సమీక్షించిన శాంతి కుమారి, ఖచ్చితమైన కార్యాచరణ, ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. న్యాయపరమైన చిక్కులు ఉన్నా, మిగతా శాఖలతో సమన్వయం అవసరం ఉన్నా, వెంటనే తమ దృష్టికి తేవాలని వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.శోభ కోరారు.

ప్రతీ పార్కులో కూడా చిక్కగా మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని, పర్యావరణ హితంగా మలిచి, సందర్శకులకు ఆహ్లాదం పంచేలా ఉండాలన్నారు. ఒక్కో పార్కులో ఐరన్ మెష్ తో కూడిన రక్షణ గోడ (సీత్రూ వాల్), ఎంట్రీ గేటు, వాకింగ్ ట్రాక్, యోగా షెడ్, టాయిలెట్ల తప్పనిసరిగా ఉండాలన్నారు. సందర్శకులు ఎక్కువగా ఉండే పార్కుల్లో అవసరాన్నిబట్టి మిగతా సౌకర్యాల కల్పన అటవీ చట్టాలకు లోబడి జరగాలన్నారు. కనీస సౌకర్యాలను కల్పిస్తూ, పర్యావరణ పరంగా అటవీ ప్రాంతాలకు రక్షణ, పునరుద్దరణకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని శాంతి కుమారి సూచించారు.

సమావేశంలో పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. డోబ్రియల్, వివిధ సర్కిళ్లకు చెందిన చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లాల అటవీ అధికారాలు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఫారెస్ట్ కార్పోరేషన్, టీసీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. 

More Press Releases