అత్యాధునిక 'క్వార్టజ్ క్వాన్టజ్' ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Related image

రంగారెడ్డి 31 జూలై 2021: శనివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని మేకగూడలో పోక‌ర్ణ ఇంజ‌నీర్డ్ స్టోన్ లిమిటెడ్ క్వార్టజ్ క్వాన్టజ్ రెండవ యూనిట్ ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి తారక రామారావు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గత ఏడు సంవత్సరాలుగా పారిశ్రామికీకరణ రంగంలో తెలంగాణ భారతదేశంలో ముందుందని, సమర్థవంతమైన నాయకత్వం, సుస్థిరతో కూడిన ప్రభుత్వం ఈ రెండు ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సమతుల్యమైన అభివృద్ధి జరుగుతుందని అందులో భాగంగా పల్లెల్లో పల్లె ప్రగతి, పట్టణంలో పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళుతుందని మంత్రి అన్నారు.

రాష్ట్రంలో ఒకవైపు పారిశ్రామికీకరణకు ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇస్తూనే ఉపాధి కల్పనకు అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి, కులవృత్తులకు ప్రాధాన్యతను ప్రభుత్వం కల్పిస్తుందని, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు కలిసికట్టుగా ముందుకు నడిచినప్పుడు సమతుల్యమైన అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి అన్నారు.

తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్ ఐపాస్ ద్వారా విప్లవాత్మకమైన విధానం వచ్చిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణస్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం వచ్చిందని అన్నారు. తెలంగాణలో పరిశ్రమ స్థాపించాలంటే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ టీఎస్ ఐపాస్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో అనుమతులు లభిస్తాయని అన్నారు. టీఎస్ఐపాస్ వచ్చినప్పటినుండి 15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందని మంత్రి అన్నారు.

స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని పరిశ్రమ యాజమాన్యానికి సూచించారు. నిరుద్యోగులకు కావాల్సిన నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. మేకగూడలో పరిశ్రమ స్థాపించిన పోకర్ణ ఇంజనీర్  స్టోన్ పరిశ్రమ యాజమాన్యానికి ఈ సందర్భంగా మంత్రి అభినందనలు తెలిపారు. అనంతరం పరిశ్రమ వెబ్సైట్ క్వార్టజ్ క్వాన్టజ్ ను మంత్రి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబ్ నగర్ నియోజవర్గ పార్లమెంట్ సభ్యుడు మన్నే శ్రీనివాస్ రెడ్డి,  పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్సెక్రెటరీ జయేష్ రంజన్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కే. దామోదర్ రెడ్డి, షాద్ నగర్ శాసనసభ్యుడు అంజయ్య యాదవ్, చేవెళ్ల శాసన సభ్యుడు కాలే యాదయ్య, మర్రిజనార్దన్ రెడ్డి, దానం నాగేందర్, కంపెనీ చైర్మన్ గౌతం జైన్, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

More Press Releases