కరోనా మృతుల దహనానికి కట్టెల కొరత, చేయూతను అందించాలని ఫారెస్ట్ కార్పోరేషన్ నిర్ణయం

Related image

  • స్మశానాలకు సుమారు వెయ్యి టన్నుల కలపను ఉచితంగా అందించేందుకు ప్రయత్నం
హైదరాబాద్: కరోనా విపత్తు నేపథ్యంలో తమ వంతుగా మానవతా దృక్పథంతో సహాయం అందించాలని నిర్ణయించింది తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్. ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న మరణాలు, స్మశానాల్లో కరోనా మృతుల దహనానికి కట్టెల కొరత తీవ్రంగా ఉందన్న వార్తల నేపథ్యంలో ఫారెస్ట్ కార్పోరేషన్ స్పందించింది. తమ పరిధిలో ఉన్న సుమారు వెయ్యి టన్నుల కలపను ఉచితంగా సరఫరా చేస్తామని అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు.

ఫారెస్ట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్లాంటేషన్ ప్రతీ యేటా చేపడుతారు. ఈ కలపను కార్పోరేషన్ నుంచి పేపర్ మిల్లులు సేకరిస్తాయి. ఇలా అమ్మగా మిగిలిన సుమారు వెయ్యి టన్నుల కలపను హైదరాబాద్ తో సహా సమీప మున్సిపాలిటీల స్మశానాలకు మృతదేహాలను కాల్చేందుకు సరఫరా చేస్తామని ఎఫ్.డీ.సీ ప్రకటించింది. ఎక్కువ సంఖ్యలో మరణాలు, అదే సమయంలో స్మశానాలకు సరిపడా కలప దొరకటం లేదన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అలాగే పెరిగిన కలప ధరలు కూడా పేదలకు భారంగా పరిణమించటంతో మానవతా దృక్పథంలో సహాయం చేయాలన్న ఆలోచనతో 20 లక్షల రూపాయల విలువైన కలపను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చామని ప్రతాప్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, మిగతా పట్టణాల్లో స్థానిక మున్సిపల్ అధికారులతో సమన్యయం ద్వారా కలపను అందించే ఏర్పాట్లు చేస్తామని కార్పోరేషన్ వైస్ చైర్మన్, ఎండీ జీ.చంద్రశేఖర రెడ్డి తెలిపారు.

రంగారెడ్డి డివిజన్ లో 3,500 టన్నుల కలప, ఖమ్మం-సత్తుపల్లి- అశ్వారావుపేట-భద్రాచలం డివిజన్లలో 4,000 టన్నులు, మంచిర్యాల- కాగజ్ నగర్ లలో 860 టన్నులు, వరంగల్ డివిజన్ లో 200 టన్నుల కలప అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అంత్యక్రియలకు అవసరమైన వెదరును కూడా సరఫరా చేస్తామని ఎఫ్.డీ.సీ తెలిపింది.

హైదరాబాద్ పరిధిలో అంబర్ పేట, బన్సీలాల్ పేట, ఆసిఫ్ నగర్, ఈ.ఎస్.ఐ స్మశాన వాటికలకు ఈ వారంలో కలప తరలిస్తామని తెలిపారు. తమ వారి అంత్యక్రియలకు అవసరమైన కలప లభ్యత లేని పేదలు స్థానిక మున్సిపల్ అధికారులను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. కలపను తరలించేందుకు స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్లు కూడా ముందుకు వచ్చినట్లు చంద్రశేఖర రెడ్డి అన్నారు.

More Press Releases