ఎకో టూరిజం పార్కుల అభివృద్ధిపై మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ స‌మీక్ష‌

Related image

హైద‌రాబాద్, మార్చి 27: ప‌ర్యాట‌క శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, అటవీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో రాష్ట్రంలో ఏకో - టూరిజం అభివృద్ధిపై పర్యాటక - అటవీ శాఖ ఉన్నతస్థాయి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో అటవీశాఖ పరిధిలోని టూరిజం ప్రాంతాల్లో పర్యాటకుల సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పనపై మంత్రులు అటవీ, ప‌ర్యాట‌క‌ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి అదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఎకో టూరిజం అభివృద్ధి పై చర్చించారు. క‌వ్వాల్ జంగిల్ స‌ఫారీ, ల‌క్న‌వ‌రం, పాకాల చెరువులు, బోగ‌త వా‌ట‌ర్ ఫాల్స్, మ‌ల్లూర్ ట్రెక్కింగ్ పాత్ వే లు, ఫ‌ర్హాబాద్ ఎకో స‌ర్యూట్ పార్కుల‌ అభివృద్దిపై ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. రిజ‌ర్వాయర్లలో టూరిజాన్ని అభివృద్ధి చేసి ప‌ర్యాట‌కుల కోసం మ‌రిన్ని బోట్లు అందుబాటులోకి తీసుకురావాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. టైగ‌ర్ రిజ‌ర్వ్ జోన్లు, వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ కేంద్రాలు, శాంక్చూరీలు ఉన్న చోట అట‌వీ శాఖ అనుమ‌తులు తీసుకుని అభివృద్ది ప‌నులు చేప‌ట్టాల‌న్నారు. క‌డెం రిజర్వాయ‌ర్ లో కొత్త బోట్లను ఏర్పాటు చేయాలని ఎమ్యెల్యే రేఖా శ్యాంనాయ‌క్ మంత్రుల‌ను కోర‌గా త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని ప‌ర్యాట‌క శాఖ అధికారుల‌కు మంత్రులు సూచించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రేఖా శ్యాంనాయక్, విఠల్ రెడ్డి, రాథోడ్ బాపురావు, దివాకర్ రావు, ఆత్రం స‌క్కు, అట‌వీ అభివృద్ది సంస్థ  చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు ప్రభుత్వ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్ శోభ, ప‌ర్యాట‌క శాఖ‌ కార్యదర్శి కేఎస్. శ్రీనివాస రాజు, పీసీసీఎఫ్ సోష‌ల్ ఫారెస్ట్రీ ఆర్.యం. డోబ్రియ‌ల్, ప‌ర్యాట‌క శాఖ ఎండీ మనోహర్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

72వ జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్ షిప్ 2021ను ప్రారంభించిన మంత్రి:
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గల వెలో డ్రమ్ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో 72వ జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్ షిప్ 2021ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో సైక్లింగ్ డ్రం లో జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. 27 రాష్ట్రాల నుంచి దాదాపు 700 మంది సైక్లింగ్ రైడర్లు ఈ చాంపియన్ షిప్ లో పాల్గొంటున్నారు. ఈ పోటీలు నేటి నుండి మార్చి 31 వరకు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసి తెలంగాణను క్రీడా హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. రాష్ట్రంలో క్రీడా సదుపాయాలు క్రీడల అభివృద్ధికి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి రిజర్వేషన్లను అమలు చేస్తున్నామన్నారు. ఉన్నత విద్య కోసం 0.5 శాతం, ఉద్యోగాలలో 2% రిజర్వేషన్లను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు. హైదరాబాద్ నగరం క్రీడా హబ్ గా రూపొందించడానికి అనువైన సిటీగా దేశంలో ఇప్పటికే పేరుప్రఖ్యాతులు లభిస్తున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, సైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఛైర్మన్ కచర్ల రాజ్ కుమార్, అధ్యక్షులు P. మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి, కార్యదర్శి కటకం దత్తాత్రేయ, కో చైర్మన్ అనురాగ్ సక్సెనా, విజయ్, డా. మాక్స్ వెల్ ట్రేవోర్, వెంకట్ కుంభంలతో పాటు అంతర్జాతీయ క్రీడాకారులు VN సింగ్, తదితరులు పాల్గొన్నారు.

More Press Releases