భక్తులకు స్పీడ్ పోస్టు ద్వారా ప్రసాదం.. ఒప్పందం కుదుర్చుకున్న దేవాదాయ శాఖ

Related image

  • ఇష్టదైవం ప్రసాదం నేరుగా ఇంటికే
  • పొస్ట్ ఆఫీసులో ప్ర‌సాదం, ఆల‌య పూజ‌ సేవ‌ల బుకింగ్
  • పోస్టల్ డిపార్ట్ మెంటుతో ఒప్పందం కుదుర్చుకున్న దేవాదాయ శాఖ
  • పోస్ట్ ఆఫీసులో ఫామ్ పూర్తి చేసి, డబ్బు చెల్లిస్తే ఇంటికే ప్రసాదం
  • మ‌రో 15 ఆలయాల్లోనూ మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్ పూజ‌‌ సేవలు
  • ఆఫ్ లైన్, ఆన్ లైన్ సేవ‌ల‌ను ప్రారంభించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి
హైద‌రాబాద్, మార్చి 27: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాలను (డ్రై పూట్స్) భక్తుల దగ్గరకు చేరవేసేందుకు తగిన ఏర్పాట్లు చేసిన‌ట్లు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం పోస్టల్ శాఖ సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. త‌పాల శాఖ ద్వారా ఇంటికే దేవుళ్ళ ప్రసాదాలు, మొబైల్ యాప్ ద్వారా పూజ సేవ‌లను శ‌నివారం అర‌ణ్య భ‌వ‌న్ లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ‌లోని 10 ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాల ప్రసాదాన్ని స్పీడ్ పోస్ట్‌లో రాష్ట్రంలో ఎక్కడికైనా పంపే విధంగా పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చ‌కున్నామ‌న్నారు. ప్రసాదం (డ్రై పూట్స్) హోం డెలివరీ కావాలనుకున్న భక్తులు.. నేరుగా ఏ పోస్ట్ ఆపీసుకైనా వెళ్లి బుక్ చేసుకోవ‌చ్చని తెలిపారు. పోస్ట్ ఆఫీసులో భక్తులు తమకు నచ్చిన గుడిలో ప్ర‌సాదాల‌కు రుసుం చెల్లిస్తే, వారి పేరిట ప్రసాదాలను పోస్టు ద్వారా ఇంటికే పంపిస్తార‌ని పేర్కొన్నారు. ఆర్డర్ చేసిన రెండు, మూడు రోజుల్లో ప్రసాదాన్ని స్పీడ్ పోస్టులో భక్తుల ఇంటికి డోర్ డెలివరీ చేస్తార‌ని వివ‌రించారు. దేశ వ్యాప్తంగా 1.60 ల‌క్ష‌ల పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చ‌న్నారు. దీంతో పాటు ఆల‌య పూజ‌ సేవ‌ల బుకింగ్ ల‌ను కూడా త‌పాల శాఖ ద్వారా అందుబాటులోకి తెస్తున్నామ‌న్నారు. మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో పూజ‌ సేవ‌ల‌ను బుక్ చేసుకోలేని వారికోసం పోస్ట్ ఆఫీసులో ఆఫ్ లైన్ ద్వారా ఈ స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు.

యాదాద్రి శ్రీ ల‌క్ష్మిన‌ర్సింహాస్వామి దేవాస్థానం, భ‌ద్ర‌చ‌లం శ్రీ సీతారామ‌చంద్ర స్వామి ఆల‌యం, వేముల‌వాడ - శ్రీ రాజ‌రాజేశ్వ‌ర ‌స్వామి ఆల‌యం, బాస‌ర శ్రీ జ్ఞాన స‌ర‌స్వ‌తీ అమ్మ‌వారి దేవాస్థానం, కొండ‌గ‌ట్టు అంజ‌నేయ స్వామి టెంపుల్, కొముర‌వెల్లి మ‌ల్లికార్జున స్వామి ఆల‌యం, ఉజ్జ‌యిని మ‌హాంకాళీ ఆల‌యం, సికింద్రాబాద్ గ‌ణేష్ టెంపుల్, బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ‌ - పోచమ్మ టెంపుల్‌, కర్మాన్ ఘాట్ హ‌నుమాన్ దేవాల‌యంలో ఈ సేవ‌లు అందుబాటులోకి రానునున్నాయి.

అదే విధంగా దేవస్థానాల్లో జరుగు నిత్య ఆర్జిత సేవల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశము లేని భక్తులు అన్నిసేవలు పరోక్షముగా వారి గోత్ర నామములతో జరిపించడానికి ఆన్ లైన్ సేవ‌ల‌ను విస్త‌రిస్తున్నామ‌ని తెలిపారు. దేవాదాయ శాఖలోని మ‌రో 15 ఆల‌యాల్లో ఈ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయ‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే 22 ప్రసిద్ధ ఆల‌య సేవ‌ల‌ను మొబైల్ యాప్ (T App Folio") ద్వారా ఆన్ లైన్ లో అందుబాటులోకి తెచ్చామన్నారు. అన్ని సేవలు పరోక్షముగా వారి గోత్ర నామములతో జరిపించడానికి ఈ మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, తెలంగాణ‌ చీఫ్ పోస్ట్ మాస్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఎస్. రాజేంద్ర కుమార్, దేవాదాయ శాఖ అద‌న‌పు క‌మిష‌న‌ర్ కృష్ణ‌వేణి, హైద‌రాబాద్ రీజీయ‌న్ పోస్ట్ మాస్ట‌ర్ జ‌న‌ర‌ల్ పీవీఎస్ రెడ్డి, హైద‌రాబాద్ పోస్ట్ మాస్ట‌ర్ జ‌న‌ర‌ల్ సాగ‌ర్ హ‌నుమాన్ సింగ్, డైరెక్ట‌ర్ ఆఫ్ పోస్టల్ స‌ర్వీస్ ఎస్వీ రావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

More Press Releases