భైంసాలో జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండించిన హోంమంత్రి

Related image

నిర్మల్ జిల్లా,భైంసాలో 7.3.2021నాడు జరిగిన సంఘటనను హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ తీవ్రంగా ఖండించారు. సంఘటన, పరిస్థితులపై జిల్లా ఎస్పీ, కలెక్టర్ లతో అదే రోజు రాత్రే ఫోను లో వివరాలు తెలుసుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.

భైంసాలో శాంతి సామరస్యాలను కాపాడడానికి అవసరమైన అన్ని పటిష్ట చర్యలు తీసుకోవాలని, పోలీసు బలగాలను భైంసాలోని అన్ని సున్నిత మరియు సమస్యాత్మక ప్రాంతాలలో నియమించాలని సూచించారు. తెలంగాణ డీజీపీతో కూడా మాట్లాడి అన్ని చర్యలను తీసుకోవాలని, భైంసా ఒక సున్నిత ప్రాంతం కాబట్టి, ఇట్టి సంఘటనలు పునరావృత్తం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డీజీపీని హోం మంత్రి ఆదేశించారు.

భైంసాలో పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు హోంమంత్రి చెప్పారు. సంఘటనలో గాయాల పాలయినవారికి అవసరమైన చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం ఆస్తి నష్టం, ఇతర వివరాలను సేకరిస్తున్నారని, ప్రస్తుతం భైంసా పట్టణంలో సెక్షన్ 144 విధించబడిందని, పరిస్థితి పూర్తి అదుపులో ఉందని, సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి అన్ని చర్యలు తీసుకున్నామని హోం మంత్రి తెలిపారు.

భవిష్యతులో ఇట్టి సంఘటనల నిరోధానికి వివిధ చర్యలు తీసుకుంటున్నామని త్వరలో భైంసాలో పెద్ద సంఖ్యలో సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేస్తామని హోం మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా భైంసా పట్టణ ప్రజలు, సోదరభావాన్ని పెంపొందించుకోవాలని, పోలీసులకు అల్లర్లకు పాల్పడే లేదా ప్రేరేపించే వారి సమాచారం ఉంటే అందించి, శాంతికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.

More Press Releases