ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా రొయ్య పిల్లల పంపిణీ: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: ఈ నెల 24 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా రొయ్య పిల్లలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం తెలిపారు. మత్స్యకారులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతను అందిస్తూ ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వరంలోని తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కులవృత్తులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సంవత్సరం 10.40 కోట్ల రూపాయల ఖర్చుతో 47 రిజర్వాయర్లు, 45 చెరువులలో 5 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయనున్నట్లు వివరించారు.

రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  కోరారు. రాష్ట్రంలోని మత్స్యకారులు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనే ధృడ సంకల్పంతో దేశంలో ఎక్కడా లేని విధంగా 2016 -17 నుండి ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని వివరించారు. మత్స్యకారులకు అదనపు ఆదాయం సమకూర్చాలనే ఆలోచనతో 2017-18 సంవత్సరం నుండి ఉచితంగా మంచినీటి రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలలో చేప పిల్లలు, రొయ్య పిల్లలను విడుదల చేయడం ద్వారా మత్స్య సంపద పెరిగి మత్స్యకారులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పారు. 2017-18 సంవత్సరంలో 1.38 లక్షల ఖర్చుతో 11 రిజర్వాయర్లలో కోటి 8 లక్షల చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందని, 2018-19 సంవత్సరంలో 6.27 కోట్ల రూపాయల వ్యయంతో 24 రిజర్వాయర్లలో 3.19 కోట్ల రొయ్య పిల్లలను, 2019-20 సంవత్సరంలో 6.39 కోట్ల రూపాయల ఖర్చుతో 70 రిజర్వాయర్లలో 3.42 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.

మూడు సంవత్సరాలలో 14 కోట్ల రూపాయలను ఖర్చు చేసి 7.69 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేయగా, 51.50 కోట్ల రూపాయల విలువైన రొయ్యల ఉత్పత్తి జరిగిందన్నారు. 2016-17 సంవత్సరంలో 1.98 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి ఉండగా, ప్రభుత్వం ఉచితంగా రొయ్య పిల్లలను పంపిణీ చేయడం వలన 2019-20 సంవత్సరంలో రొయ్యల ఉత్పత్తి 3.10 లక్షల టన్నులకు పెరిగిందని, దీంతో సుమారు 30 వేల మత్స్యకారుల కుటుంబాల ఆదాయం కూడా గడిచిన 3 సంవత్సరాలలో రెట్టింపు అయిందని, ఇది ఎంతో సంతోషదాయకం అని అన్నారు.

More Press Releases