జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ షెడ్యూల్ వివరాలు

Related image

హైదరాబాద్, నవంబరు 10, 2020: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ స్టేషన్ల గుర్తింపు మరియు ప్రచురణ వార్డుల వారీగా నవంబరు 21వ తేదీలోపు పూర్తి చేసేందుకు నోటిఫికెషన్ జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారధి తెలిపారు.

మంగళవారం (10-11-2020) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేస్తూ జీహెచ్ఎంసీ యాక్టులోని సెక్షన్ 29 ప్రకారం వార్డులకు నియమించబడిన రిటర్నింగ్ అధికారులు ఆయా వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను గుర్తించి జీహెచ్ఎంసీ కమీషనర్ మరియు ఎన్నికల అధికారి ఆమోదం మేరకు ప్రచురించాల్సి ఉంటుందన్నారు.

తదనుగుణంగా అక్టోబర్ 27న జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల జాబితాను ఆమోదిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు.

నోటిఫికేషన్ షెడ్యూల్ వివరాలు:

  • నవంబర్ 12 వ తేదీ లోపు పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా తయారు చేయాలి.
  • జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమోదంతో నవంబరు 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను రిటర్నింగ్ అధికారులు ప్రచురించాలి.
  • దావాలు, అభ్యంతరాలు, సలహాలను నవంబర్ 17 వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు స్వీకరించాలి.
  • రిటర్నింగ్ అధికారి, సంబంధిత డెప్యూటీ కమిషనర్ తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో నవంబరు 16న సమావేశం నిర్వహించాలి.
  • దావాలు, అభ్యంతరాలు, సలహాలను నవంబర్ 18 వ తేదీ వరకు పరిష్కరించాలి.
  • రిటర్నింగ్ అధికారులు తమ వార్డు పోలింగ్ కేంద్రాల తుది జాబితాను జీహెచ్ఎంసీ కమిషనర్ కు నవంబరు 19న సమర్పించాలి.
  • జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమోదంతో నవంబరు 21న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను నిర్దేశించిన ప్రదేశాలలో ప్రచురించాలి.
జీహెచ్ఎంసీ కమిషనర్ ను ఈ విషయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నవంబరు 21న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురించేలా చూడాలని, డిప్యూటీ కమిషనర్లను ఈ విషయంలో రిటర్నింగ్ అధికారులకు అన్నివిధాలా సహకరించాలని ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటనలో తెలిపారు.

More Press Releases