ఎం.ఎం కీరవాణి స్వరపరచిన పాటను ఆవిష్కరించిన తెలంగాణ డీజీపీ

Related image

హైదరాబాద్, అక్టోబర్ 31: ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ రచించి, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి స్వరపరచి, ఆలపించిన "పోలీస్, పోలీస్.. తెలంగాణా పోలీస్, ప్రాణం పంచే మనసున్న పోలీస్" అనే పాటను డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి నేడు ఆవిష్కరించారు.

డీజీపీ కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమానికి సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి హాజరయ్యారు. సీనియర్ పోలీస్ అధికారులు ఉమేష్ ష్రాఫ్, జితేందర్, సందీప్ శాండిల్య, శివధర్ రెడ్డి, నాగిరెడ్డి, బాల నాగాదేవి, వెంకటేశ్వర్లు ఈ పాట ఎడిటర్ హైమారెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈనెల 21 వతేదీ నుండి నేడు 31 వ తేదీ వరకు నిర్వహించిన పోలీస్ ఫ్లాడ్ డే కార్యక్రమాల సందర్బంగా ఈ పాటను విడుదల చేయడం సందర్బోచితంగా ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. విధినిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే కస్టాలు, ఇబ్బందులను వివరిస్తూనే పోలీసులు అందించే సేవలను స్ఫూర్తిదాయకంగా ఆవిష్కరించారని మహేందర్ రెడ్డి ప్రశంసించారు.

మనం కష్టపడుతూ సెవలందిస్తుంటే మనతో ఎంతోమంది కలసి వస్తారనడానికి నిదర్శనం ఈ అద్భుతమైన పాటే నిదర్శనమని డీజీపీ అన్నారు.

ఈ సందర్బంగా సంగీత దర్శకుడు, గాయకుడు ఎం.ఎం కీరవాణి మాట్లాడుతూ.. మాతృ దేవోభవ, పితృ, ఆచార్య దేవోభవ అన్న మాదిరిగానే రక్షక దేవోభవ అనే రోజులు వస్తాయని, ఈ దిశగా పోలీసులు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. తన తొమ్మిదేళ్ల వయస్సులో తోలి కార్యక్రమం రాయచూరులో పోలీస్ సంస్మరణ దినోత్సవం రోజునే ఇచ్చానని తెలియజేశారు.

ఇస్తున్నా ప్రాణం మీ కోసం అనే పోలీసు త్యాగాలను తెలియచేసే పాటను 1998 సంవత్సరంలోనే అప్పటి డీజీపీలు దొర, రాములు కోరిక మేరకు స్వర పరచి పాడానని గుర్తు చేశారు. ఈ పాటను హిందీ భాషలో కూడా రూపొందిస్తానని కీరవాణి అన్నారు. ఈ సందర్బంగా ఈ పాట చాలా శ్రావ్యంగానూ, స్ఫూర్తి దాయకంగా ఉందని పోలీసు అధికారులు ప్రశంసించారు.

More Press Releases