త్వరలోనే బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వద్ద మల్టీ లెవెల్ పార్కింగ్: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: ఎంతో ప్రసిద్ది చెందిన సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వద్ద భక్తుల సౌకర్యార్ధం 3.37 కోట్ల రూపాయల వ్యయంతో మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో జీహెచ్ఎంసీ, రెవెన్యూ, మెట్రో రైల్, దేవాదాయ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బల్కంపేట ఎల్లమ్మ తల్లి దర్శనం కోసం వచ్చే అనేక మంది భక్తులు తమ వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు సరైన సౌకర్యం లేకపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

దీనిని దృష్టిలో ఉంచుకొని సమస్య పరిష్కారం కోసం ఆలయం పక్కనే గల సుమారు 527 గజాల స్థలంలో జీ ప్లన్ 2 విధానంలో మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించడం జరిగిందని వివరించారు. మొదటగా నిర్మాణ పనులను మెట్రో రైల్ ఆధ్వర్యంలో చేపట్టాలని నిర్ణయించినప్పటికీ, ప్రస్తుతం ఆ నిర్మాణ పనులను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపడతారని మంత్రి వివరించారు. త్వరలోనే పనులు చేపట్టి వీలైంత త్వరగా పనులను పూర్తి చేసి ఎంతో కాలంగా అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు ఎదుర్కొంటున్న వాహనాల పార్కింగ్ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని మంత్రి చెప్పారు.

ఈ సమావేశంలో GHMC ప్రాజెక్ట్స్ SE జ్యోతిర్మయి, EE సత్యనారాయణ రెడ్డి, సికింద్రాబాద్ RDO వసంత, మెట్రో రైల్ GM రాజేశ్వర్ రావు, EE ప్రసాద్, దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, బల్కంపేట ఆలయ EO అన్నపూర్ణ, EE మల్లికార్జున్, అమీర్ పేట MRO చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

More Press Releases